నారీ..సంపన్నకారి
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:53 AM
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలను మరింత బలోపే తం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది.
స్వయం సహాయక సంఘాల వ్యాపారాల బలోపేతానికి ఐఐఎంవీ ఫీల్డ్ చేయూత
సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో సెర్ప్, ఐఐఎం ఫీల్డ్ మధ్య ఒప్పందం
ఆదాయాన్ని పెంచడం, బ్రాండింగ్, మార్కెటింగ్ మెరుగుపరచడం, ఖర్చులను తగ్గించడమే లక్ష్యం
ఎంపిక చేసిన 150 సంస్థలకు శిక్షణ
ఆహారశుద్ధి, చిన్నతరహా తయారీ, సేవారంగాల్లో పోత్సాహం
దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 15 వరకూ అవకాశం
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలను మరింత బలోపే తం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. సంఘ మహిళలు చేస్తున్న వ్యాపారాలను మరోస్థాయికి తీసుకువెళ్లేందుకు అవసర మైన శిక్షణ, ఇతర సహకారాన్ని అందించేలా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)కు చెందిన ఇంక్యుబేషన్ అండ్ స్టార్టప్ కేంద్రం (ఐఐఎంవీ ఫీల్డ్)తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సెర్ప్ ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో ఎంపిక చేసిన 150 డ్వాక్రా సంఘాలకు (వ్యాపారం చేస్తున్నవాటికి మాత్రమే) ఎంటర్ ప్రెన్యూర్షిప్లో రెండేళ్లపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ప్రొగ్రామ్కు సంపన్నకారి అనే పేరును నిర్ణయించారు. ఆయా వ్యాపారాల అభివృద్ధి, విస్తరణకు అవసరమైన ఫండింగ్ సపోర్ట్, మార్కెట్ లింకేజీలు, కెపాసిటీ బిల్డింగ్, మెంటార్షిప్, బ్రాండింగ్ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
ఇదీ లక్ష్యం..
ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం డ్వాక్రా మహిళలు చేసే వ్యాపారాలకు మార్కెట్ను విస్తరించడం, ఆదాయం పెంచడం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు వ్యవసాయేతర జీవనోపాధి మార్గాలను బలోపేతం చేయడం లక్ష్యంగా సంపన్న కారిని అమలు చేయనున్నారు. ఆహారశుద్ధి, చిన్నతరహా తయారీ, సేవల రంగాల్లో వ్యాపారాలను ప్రోత్సహించనున్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి మరింత విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. శిక్షణ, మార్గదర్శకత్వం, ఆర్థిక సహాయం ద్వారా స్థిరమైన గ్రామీణాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా సంపన్నకారిని అమలుచేస్తున్నట్టు ఐఐఎం అధికారులు చెబుతున్నారు.
వీటికి ప్రాధాన్యం..
సంపన్నకారి ప్రొగ్రామ్లో శిక్షణకు డ్వాక్రా సంఘాలకు చెందిన వ్యాపార సంస్థలను ఎంపిక చేయనున్నారు. సుమారు రూ.12 లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రారంభదశలో ఉన్న కొత్త వ్యాపారాలకు దాదాపు పది శాతం అవకాశం ఉంటుందన్నారు. ప్రధానంగా ఆదాయాన్ని పెంచడం, బ్రాండింగ్, మార్కెటింగ్ మెరుగుపరచడం, ఖర్చులను తగ్గించడం, లాభదాయకతను పెంచడమే లక్ష్యంగా ఐఐఎంవీ ఫీల్డ్లో శిక్షణ అందించనున్నారు. వార్షికంగా 15 శాతం వృద్ధి సాధించేలా సంపన్నకారి ప్రొగ్రామ్ను నిర్వహిస్తారు. ఆయా వ్యాపార సంస్థల పనితీరు ఆధారంగా చాలెంజ్ గ్రాంట్స్, సబ్సిడీ లేదావడ్డీ రుణాలను అందించేందుకు అవసరమైన సహకారాన్ని ఐఐఎంవీ ఫీల్డ్ అందిస్తుంది. ఈ ప్రొగ్రామ్లో భాగస్వాములు కావాలనుకునే స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐఐఎం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ వెల్లడించారు. తొలుత 500 నుంచి వేయి దరఖాస్తులను ఎంపికచేసి తరువాత ఫీల్డ్ విజిట్ చేస్తారు. అనంతరం వాటిలో 150 వ్యాపారాలను ఎంపికచేసి అవసరమైన సహకారాన్ని అందిస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.పది కోట్లు అందిస్తోంది. ఇందులో రూ.6 కోట్ల వరకు మహిళలకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు వినియోగించను న్నారు. దరఖాస్తు చేయాలనుకునే స్వయం సహాయక సంఘాల మహిళలు జ్ట్టిఞ://్ఛ్ఛ.జుౌఛ్టౌౌౌజూఛ్ఠౌ.ౌటజ/్ఠ/ఛూ1జూజఏ3ఈ లోకి వెళ్లడం ద్వారా యాప్లో లాగిన్ అవుతారు. అక్కడ పూర్తిగా తెలుగులో సంబంధించిన అంశాలను ఇవ్వడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.