చింతపండు ధరకు రెక్కలు
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:52 PM
మాడుగులలో సోమవారం వారపు సంతలో విక్రయానికి తెచ్చిన చింతపండుకు మంచి ధర పలికింది.
30 కిలోల కావిడి రూ.3,500కు విక్రయం
మాడుగుల, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): మాడుగులలో సోమవారం వారపు సంతలో విక్రయానికి తెచ్చిన చింతపండుకు మంచి ధర పలికింది. పాడేరు ఏజెన్సీలోని దేవాపురం, ఈదులపాలెం, కక్కి, కందులపాలెం, చింతగరువు, పులుసుమామిడి వంటి పలు గిరిజన గ్రామాల నుంచి ఇక్కడి వారపు సంతలో విక్రయించేందుకు కావిళ్లు, నెత్తి బరువు మోతలతో రైతులు చింతపండును తీసుకు వచ్చారు. అయితే గత రెండు వారాల నుంచి చింతపండు సీజన్ ప్రారంభం కావడంతో సంతలో విక్రయించేందుకు దిగుబడి తక్కువగానే వస్తుంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి చింతపండు కొనుగోలు చేసే వ్యాపారులు అధికంగా రావడంతో పోటీ ఏర్పడింది. గత వారం 30 కిలోల చింతపండు కావిడి రూ.3,000 ధర పలకగా, ఈ వారం రూ.3,500 పలికింది. ధర పెరగడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చింతపండు దిగుబడి తక్కువగానే ఉందని, మున్ముందు రోజుల్లో చింతపండు ధర డిమాండ్ను బట్టి మరింత పెరిగే అవకాశఽం ఉందని రైతులు చెబుతున్నారు.