బ్లడ్బ్యాంకు భవన నిర్మాణం ప్రారంభమయ్యేనా?
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:09 PM
అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో బ్లడ్బ్యాంకును తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రకటించడంతో ఈ ప్రాంతవాసులు ఎంతో ఆనందపడ్డారు.
శంకుస్థాపన చేసి రెండు నెలలు దాటినా మొదలుకాని పనులు
డిప్యూటీ సీఎం సొంత నిధులతో నిర్మిస్తానని ప్రకటించినా కదలిక శూన్యం
అరకులోయ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో బ్లడ్బ్యాంకును తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రకటించడంతో ఈ ప్రాంతవాసులు ఎంతో ఆనందపడ్డారు. బ్లడ్బ్యాంకు భవన నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 8న కలెక్టర్ దినేశ్కుమార్ శంకుస్థాపన చేయడంతో తమ కష్టాలు తీరాయని అందరూ భావించారు. అయితే ఇప్పటికీ పనులు ప్రారంభంకాకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
రక్తహీనతతో బాధపడుతున్న గిరిజనుల కష్టాలను చూసి డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చలించిపోయారు. ఈ ప్రాంతంలో బ్లడ్బ్యాంకు అవసరమని గుర్తించి అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో భవన నిర్మాణానికి తన సొంత నిధులు రూ.95 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 8న కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అయితే శంకుస్థాపన చేసి రెండు నెలలు దాటినా పనులు ప్రారంభంకాలేదు. ఇప్పటికీ శంకుస్థాపన చేసిన గొయ్యే దర్శనమిస్తోంది. ఈ విషయంపై స్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్ రామును వివరణ కోరగా ఈ భవన నిర్మాణ పనులకు సంబంధించి ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎంఎస్ఐడీసీ) అధికారులు బ్లూప్రింట్ను ప్రభుత్వానికి పంపారన్నారు. అక్కడ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే టెండర్ పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని జనసేన నేత గంగులయ్య వద్ద ప్రస్తావించగా ఏపీ ఎంఎస్ఐడీసీ చైర్మన్, కలెక్టర్ దృష్టికి దీనిని తీసుకువెళతానని తెలిపారు. కాగా బ్లడ్బ్యాంకు భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని గిరిజనులు కోరుతున్నారు.