క్రీడాకారుల కల నెరవేరేనా?
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:27 AM
చింతపల్లిలో ఇండోర్ స్టేడియం నిర్మాణం కలగానే మిగిలిపోయింది. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ పునాదులకే పరిమితమైంది. దీంతో గిరిజన క్రీడాకారులు నిరాశ చెందుతున్నారు.
చింతపల్లిలో అసంపూర్తిగా ఇండోర్ స్టేడియం నిర్మాణం
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ముందుకు సాగని పనులు
కూటమి ప్రభుత్వంలోనైనా పూర్తవుతుందేమోనని ఆశాభావం
చింతపల్లి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): చింతపల్లిలో ఇండోర్ స్టేడియం నిర్మాణం కలగానే మిగిలిపోయింది. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ పునాదులకే పరిమితమైంది. దీంతో గిరిజన క్రీడాకారులు నిరాశ చెందుతున్నారు.
గిరిజన యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం చింతపల్లిలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రూ.80 లక్షల విద్యా మౌలిక సదుపాయాలు(ఈఐ) నిధులను మంజూరు చేసింది. అదే ఏడాది నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. 2018లో నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. స్టేడియం పునాదులు, శ్లాబ్ స్థాయి వరకు పిల్లర్లు నిర్మించారు. దీనికి సంబంధించిన రూ.20 లక్షల బిల్లులను నాటి ప్రభుత్వం కాంట్రాక్టర్కి మంజూరు చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక స్టేడియం నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు విడుదల కాలేదు. దీంతో కాంట్రాక్టర్ నిర్మాణ పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. కాగా కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు పునఃప్రారంభంకాకపోవడంపై క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తే..
ఇండోర్ స్టేడియం నిర్మాణం జరిగితే క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. స్టేడియంలో షటిల్, టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, తదితర ఇండోర్ క్రీడల కోసం ప్రత్యేకంగా క్రీడా ప్రాంగణాలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే డివిజన్, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలు జరిగే అవకాశం ఉండేది.