వీఎంఆర్డీఏలో దుబారా
ABN , Publish Date - Jul 09 , 2026 | 01:13 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ)లో ఇటీవల నిధుల దుబారా అధికమైంది. అవసరం లేని ఖర్చులు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఏదైనా ఖర్చు చేయాలంటే ఆచితూచి నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు ప్రతిపాదించడం, ఖర్చు చేయడం, బిల్లులు చెల్లించడం...ఇదే నడుస్తోంది.
జిమ్ పేరుతో రూ.2 కోట్లు వ్యయం
ఇప్పుడు నిర్వహణకు మళ్లీ టెండర్లు
వెనుకాముందు ఆలోచించకుండా ఖర్చు పెడుతున్న అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ)లో ఇటీవల నిధుల దుబారా అధికమైంది. అవసరం లేని ఖర్చులు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఏదైనా ఖర్చు చేయాలంటే ఆచితూచి నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు ప్రతిపాదించడం, ఖర్చు చేయడం, బిల్లులు చెల్లించడం...ఇదే నడుస్తోంది.
తాజాగా వీఎంఆర్డీఏ ఉద్యోగ భవన్ కాంప్లెక్స్లోనే అధునాతన జిమ్ ఏర్పాటుచేశారు. దీనికి సుమారు రూ.2 కోట్ల వరకు వ్యయం అయిందని సమాచారం. ఇప్పుడు దీనిని నిర్వహించడానికి ‘ఆసక్తి వ్యక్తీకరణ’ ప్రకటన జారీ చేయాలని నిర్ణయించారు. ఎవరైనా ముందుకువచ్చి దానిని నిర్వహించి, ఆదాయంలో 50 శాతం వీఎంఆర్డీఏకి ఇవ్వాలని అంటున్నారు. అసలు జిమ్ను వీఎంఆర్డీఏ ఎందుకు ఏర్పాటుచేయాల్సి వచ్చిందనేది పెద్ద ప్రశ్న.
ఆ జిమ్ పరిరకాలు ఏమయ్యాయి?
వీఎంఆర్డీఏకి తొలి కమిషనర్గా పనిచేసిన బసంత్కుమార్ తెల్లవారుజామునే లేచి బంగ్లా నుంచి విశాలాక్షి నగర్ వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లేవారు. ఆరోగ్యంపై శ్రద్ధ ఉండడంతో ఉద్యోగులకూ దాన్ని అలవాటు చేయాలని తొమ్మిదో అంతస్థులో ఖాళీగా ఉన్న స్థలంలో జిమ్ ఏర్పాటుచేశారు. ఒక ట్రైనర్ను కూడా నియమించారు. విధుల నిర్వహణలో అలసిపోతున్న ఉద్యోగులు ‘జిమ్’ చేయడానికి సమయం లేక పెద్దగా ఉపయోగించుకోవడం లేదు.
ఇటీవల ప్రభుత్వం ‘విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్’ (వీఈఆర్) అని కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. అందులో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలని ప్రణాళికలు ఉన్నాయి. దానికి స్థానిక బాధ్యునిగా వీఎంఆర్డీఏ కమిషనర్నే నియమించారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ వీఈఆర్ను పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల విశాఖపట్నం వచ్చి నోవాటెల్ హోటల్లో సమావేశం నిర్వహించినప్పుడు వీఈఆర్కు ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయన సాయంత్రం ఐదు గంటలకు చెప్పగా, అదేరోజు రాత్రి వీఎంఆర్డీఏలో జిమ్ను ‘వీఈఆర్ కార్యాలయం’గా మార్పు చేసి ప్రారంభించేశారు.
ఆ జిమ్ అవసరం లేదని ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినందున మౌనంగా ఉంటే సరిపోయేది. కానీ కొత్త జిమ్ ప్రతిపాదన తెచ్చారు. షాపింగ్ కాంప్లెక్స్లో నెలకు రూ.3 లక్షల ఆదాయం వచ్చే స్థలంలో కొత్త జిమ్ పెట్టారు. దానివల్ల ఆ ఆదాయం పోయింది. పాత జిమ్ పరికరాలు ఏమయ్యాయో తెలియదు. కొత్తవి కొన్నారు. సుమారుగా రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు జరిగిందని అంటున్నారు. బయట వారు కూడా వచ్చి ఎక్సర్సైజులు చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఇప్పుడు దానికి టెండర్లు పిలస్తున్నారు. పరిశ్రమల శాఖ కమిషనర్ నెలకు ఒకసారి ఇక్కడికి రావడం అరుదు. ఆయన కోసం ప్రత్యేకంగా కార్యాలయం, అందులోకి మళ్లీ ఫర్నీచర్, ఏసీలు కొనుగోలు చేశారు. వీఎంఆర్డీఏ నిధులు అంటే నీళ్ల ప్రాయంగా మారిపోయింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలా సీఎఫ్ఎంఎస్కు బిల్లులు పంపడం, క్లియరెన్స్ కోసం వేచి ఉండాల్సిన పని లేకపోవడంతో నచ్చినట్టుగా ఖర్చు చేస్తున్నారు. దీనిని ఎవరూ ప్రశ్నించే ఽధైర్యం చేయలేకపోతున్నారు.