రీజనల్ ఏవియేషన్ కేంద్రంగా విశాఖ ఎయిర్పోర్టు
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:57 AM
విశాఖపట్నం/ గోపాలపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం విమానాశ్రయాన్ని భవిష్యత్తులో రీజనల్ ఏవియేషన్, నిర్వహణ, మరమ్మతులు, ఆపరేషన్ (ఎంఆర్ఓ), కార్గో కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ శ్రీభరత్ అన్నారు.
ఎంపీ శ్రీభరత్
విశాఖపట్నం/ గోపాలపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం విమానాశ్రయాన్ని భవిష్యత్తులో రీజనల్ ఏవియేషన్, నిర్వహణ, మరమ్మతులు, ఆపరేషన్ (ఎంఆర్ఓ), కార్గో కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖపట్నం విమానాశ్రయం ఆఖరి సలహా సంఘం సమావేశాన్ని గురువారం విమానాశ్రయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వానికి 366 ఎకరాలు వుందని, దీని వినియోగంపై సీఎం చంద్రబాబుకు స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయన్నారు. భోగాపురం విమానాశ్రయం స్థిరపడ్డాక, అక్కడ ప్రయాణికుల సంఖ్య పెరిగాక, విశాఖ విమానాశ్రయం అభివృద్ధిపై దృష్టి పెడతారని వివరించారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రత్యామ్నాయం
కాంట్రాక్టు ఉద్యోగుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి చర్యలు చేపడతామని ఎంపీ హామీ ఇచ్చారు. వారి నైపుణ్యాలకు అనుగుణంగా జీఎంఆర్, హోటల్ పరిశ్రమ, హోటల్ ఫెడరేషన్, చాంబర్ ఆఫ్ కామర్స్తో పాటు ఇతర పరిశ్రమల ద్వారా పునర్నియామక అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతి విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగుల నైపుణ్యం ఆధారంగా జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో విమానాశ్రయం డైరెక్టర్ పురుషోత్తం, సలహా సంఘం సభ్యుడు ఒ.నరేశ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.