రాజ్యసభకు విజయ్?
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:30 AM
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్కు శనివారం తెలుగుదేశం అధిష్ఠానం రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. బీసీ వర్గానికి చెందిన యువ నాయకుడికి అవకాశం కల్పించడంపై పార్టీలో హర్షం వ్యక్తమవుతోంది. చింతకాయల అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులకు 1984 నవంబరు 24న జన్మించిన విజయ్ పుణే ఎంఐటీ, అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించారు. ఆధునిక రాజకీయాల నిర్వహణలో ప్రత్యేక నైపుణ్యం సాధించిన ఆయన టీడీపీ బలోపేతానికి కృషిచేశారు. విజయ్కు భార్య డాక్టర్ సువర్ణ, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
- అభ్యర్థిత్వం ఖరారు చేసిన టీడీపీ అధిష్ఠానం
- బీసీ యువనేతకు దక్కిన గౌరవం
- శ్రమ, నిబద్ధతకు గుర్తింపు
- పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు
(అనకాపల్లి, నర్సీపట్నం-ఆంధ్రజ్యోతి)
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్కు శనివారం తెలుగుదేశం అధిష్ఠానం రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. బీసీ వర్గానికి చెందిన యువ నాయకుడికి అవకాశం కల్పించడంపై పార్టీలో హర్షం వ్యక్తమవుతోంది. చింతకాయల అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులకు 1984 నవంబరు 24న జన్మించిన విజయ్ పుణే ఎంఐటీ, అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించారు. ఆధునిక రాజకీయాల నిర్వహణలో ప్రత్యేక నైపుణ్యం సాధించిన ఆయన టీడీపీ బలోపేతానికి కృషిచేశారు. విజయ్కు భార్య డాక్టర్ సువర్ణ, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
కష్టకాలంలో పార్టీ క్యాడర్కు భరోసా
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ తరపున విజయ్ బలంగా తన గళం వినిపించారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, ఐటీడీపీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు విశేష కృషిచేశారు. 2019 ఎన్నికల తరువాత పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో కార్యకర్తలకు అండగా నిలిచిన నేతల్లో విజయ్ ముందువరుసలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐటీడీపీ, సోషల్ మీడియా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ స్వరాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో నమోదైన కేసులతో ఇబ్బందులు పడిన 228 మంది కార్యకర్తలకు న్యాయ సహాయం అందించి, బెయిల్ తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. అర్ధరాత్రి సమయంలో సైతం కార్యకర్తల సమస్యల పరిష్కారానికి వెనుకాడకుండా అందుబాటులో ఉండే నాయకుడిగా విజయ్కు గుర్తింపు ఉంది. యవగళం పాదయాత్ర సందర్భంగా కార్యకర్తల కోసం విజయ్ పడిన కష్టాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేశ్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఐటీడీపీ సారథిగా సేవలు
‘మన టీడీపీ’ యాప్ రూపకల్పన, డిజిటల్ వ్యవస్థల అభివృద్ధి ద్వారా కార్యకర్తలను నేరుగా నాయకత్వానికి అనుసంధానం చేయడంలో విజయ్ కీలకపాత్ర పోషించారు. ఆయన పనితీరుపై విశ్వాసంతో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు టెక్నాలజీ ఆధారిత సభ్యత్వ నమోదు కార్యక్రమ బాధ్యతలను అప్పగించారు. కొవిడ్ సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆన్లైన్ వైద్య సలహాలు, సహాయక కార్యక్రమాల ద్వారా ప్రజలకు, పార్టీ శ్రేణులకు విజయ్ అండగా నిలిచారు. పార్టీ కోసం కష్టపడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ యువనేతకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించడంపై అన్ని వర్గాల నాయకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
6ఎన్పీ4 : నర్సీపట్నం అబీద్ సెంటర్లో విజయ్ కటౌట్ వద్ద టీడీపీ శ్రేణుల ఉత్సాహం
6ఎన్పీ5 సీట్లు తినిపించుకుంటున్న టీడీపీ నాయకులు
6ఎన్పీ6 అబీద్ సెంటర్లో బాణసంచా కాల్చుతున్న దృశ్యం
టీడీపీ శ్రేణుల సంబరాలు
- చింతకాయల విజయ్కి రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో మిన్నంటిన ఉత్సాహం
నర్సీపట్నం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ అభ్యర్థిగా చింతకాయల విజయ్ పేరు ఖరారు కావడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. శనివారం రాత్రి స్థానిక అబీద్ సెంటర్లో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. టీడీపీ జెండాలు పట్టుకొని జేజేలు పలికారు. దీంతో వాతావరణం సందడిగా మారింది.