Share News

వేర్వేరు సంఘటనల్లో ఇద్దరి మృతి

ABN , Publish Date - Feb 02 , 2026 | 01:07 AM

జిల్లాలో రావికమతం, రోలుగుంట మండలాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మృతిచెందారు. దొండపూడి ఎంపీటీసీ మాజీ సభ్యుడు సత్యారావు చెరువు వద్దకు బహిర్భూమికని వెళ్లి, ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో మునిగిపోయాడు. కొమరవోలులో విద్యుదాఘాతానికి గురై కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.

వేర్వేరు సంఘటనల్లో ఇద్దరి మృతి
తాళ్ల సత్యారావు (ఫైల్‌ ఫొటో)

చెరువులో మునిగి ఎంపీటీసీ మాజీ సభ్యుడు..

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

జిల్లాలో రావికమతం, రోలుగుంట మండలాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మృతిచెందారు. దొండపూడి ఎంపీటీసీ మాజీ సభ్యుడు సత్యారావు చెరువు వద్దకు బహిర్భూమికని వెళ్లి, ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో మునిగిపోయాడు. కొమరవోలులో విద్యుదాఘాతానికి గురై కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.

----

రావికమతం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దొండపూడి ఎంపీటీసీ మాజీ సభ్యుడు తాళ్ల సత్యారావు (65) గ్రామంలో కిరణా దుకాణం నిర్వహిస్తున్నారు. రోజూ తెల్లవారుజామున నిద్ర లేచిన తరువాత గ్రామ శివారులో ఉన్న పెద్ద చెరువు వరకు వాకింగ్‌కు వెళ్లి, కాలకృత్యాలు తీర్చుకొని వస్తుంటారు. ఆదివారం తెల్లవారుజామున ఇదే విధంగా వాకింగ్‌కు వెళ్లిన ఆయన పెద్ద చెరువు వద్ద బహిర్భూమికి వెళ్లి పొరపాటున కాలుజారి నీటిలో మునిగిపోయాడు. ఈ సమయంలో చీకటిగా వుండడం, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో గమనించలేదు. తెల్లవారినప్పటికీ సత్యారావు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పెద్ద చెరువులో మృతదేహం నీటిపై తేలడంతో అక్కడ వున్న వారు చూసి కుటుంబ సభ్యులకు చెప్పారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బందినిఇ రప్పించి మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య రవణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొత్తకోట ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ తెలిపారు.

విద్యుతాఘాతంతో కార్మికుడి మృతి

రోలుగుంట, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొమరవోలులో విద్యుత్‌ లైన్లు పనులు చేస్తుండగా కరెంట్‌ షాక్‌కు గురై ఒక కార్మికుడు మృతిచెందాడు. ఎస్‌ఐ రామకృష్ణారావు అందించిన వివరాల ప్రకారం... రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ సుమారు ఎనిమిది నెలల నుంచి రోలుగుంట, మాకవరపాలెం మండలాల్లో ఏజీఎల్‌ లైన్ల మరమ్మతు పనులు చేస్తున్నది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 15 మంది కార్మికులు ఈ పనులు చేస్తున్నారు. ఆదివారం ఉదయం కొమరవోలులో పనులు చేయడానికి వచ్చారు. వీరిలో షాపికూల్‌ (28) విద్యుత్‌ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా కరెంట్‌ షాక్‌కు గురై కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Feb 02 , 2026 | 01:07 AM