కొబ్బరిచెట్టు కూలి ఇద్దరి మృతి
ABN , Publish Date - May 23 , 2026 | 11:41 PM
మండలంలోని సత్యవరం గ్రామంలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు కొబ్బరిచెట్టు కూలి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు.
పాయకరావుపేట రూరల్, మే 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సత్యవరం గ్రామంలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు కొబ్బరిచెట్టు కూలి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. అరట్లకోట గ్రామానికి చెందిన గెడ్డమూరి శంకరయ్య(55), గర్లంక దొరబాబు అలియాస్ యరకయ్య (41), మరో ముగ్గురు కూలీలు గెడ్డమూరి సన్యాశిరావు, వేముల రాంబాబు, చిట్టిపల్ల రమణలతో కలిసి శనివారం సత్యవరం గ్రామానికి చెందిన రైతు సఖిలేటి కృష్ణ తమలపాకు తోటలో తీగలు కట్టడానికి వచ్చారు. సాయంత్రం అకస్మాత్తుగా వీచిన ఈదురుగాలులకు తోటలో నుంచి ఆ ఐదుగురూ బయటకు వస్తుండగా గెడ్డమూరి శంకరయ్య, గర్లంక యరకయ్యపై కొబ్బరిచెట్టు పడడంతో అక్కడకక్కడే మృతి చెందారు. సీఐ సాకేటి శంకరరావు, ఎస్ఐ ఆలీ, తహశీల్దార్ డి.శాంతిభూషణరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు సీఐ తెలిపారు.