విశాఖలో 2 బీచ్ శాక్స్
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:57 AM
తీర ప్రాంతాల్లో పర్యాటకం పెంచడానికి గోవా తరహాలో బీచ్ శాక్స్ (వెదురు, చెక్క, తాటి ఆకులతో నిర్మించే కుటీరాలు/పాకలు) ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖపట్నంతో పాటు సూర్యలంకలో పైలట్ ప్రాతిపదికన వీటిని ఏర్పాటుచేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం స్పష్టమైన విధి విధానాలు జారీచేసింది.
సీఆర్జెడ్ అనుమతి తప్పనిసరి
ఉదయం 10 నుంచి
రాత్రి 8 గంటల వరకు నిర్వహణ
బీర్లు, వైన్ మాత్రమే విక్రయం
ఐఎంఎఫ్ఎల్ అమ్మకాలపై నిషేధం
విశాఖపట్నం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి):
తీర ప్రాంతాల్లో పర్యాటకం పెంచడానికి గోవా తరహాలో బీచ్ శాక్స్ (వెదురు, చెక్క, తాటి ఆకులతో నిర్మించే కుటీరాలు/పాకలు) ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖపట్నంతో పాటు సూర్యలంకలో పైలట్ ప్రాతిపదికన వీటిని ఏర్పాటుచేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం స్పష్టమైన విధి విధానాలు జారీచేసింది. విశాఖలో రెండు, సూర్యలంకలో రెండు బీచ్ శాక్స్ ఏర్పాటుచేయాలని పేర్కొంది. బీచ్లో ప్రైవేటు భూమిలో గానీ, ఏపీ పర్యాటక అభివృద్ధి చేసిన భూమిలో గానీ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. కోస్తా నియంత్రణ మండలి (సీఆర్జెడ్) అనుమతి తప్పనిసరి. నిర్మాణం పర్యావరణహితంగా, తాత్కాలికంగా ఉండాలి. శాశ్వత కాంక్రీట్ భవనాలు నిర్మించకూడదు. కనీసం 1000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉండాలి. ఈ బీచ్ షాక్స్లో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే సూచించిన మద్యం విక్రయించాలి. అది కూడా 21 ఏళ్లు దాటిన వారికే ఇవ్వాలి. బీచ్ శాక్స్లో బీర్లు, వైన్ మాత్రమే అమ్మాలి. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్), ఫారిన్ లిక్కర్ విక్రయించకూడదు. బీచ్ షాక్స్ను పర్యాటక శాఖ నిబంధనల ప్రకారం రాత్రి ఎనిమిది గంటల తరువాత కూడా నిర్వహించుకోవచ్చు. ఆహారం పెట్టొచ్చు. బీర్లు, వైన్ మాత్రం అమ్మకూడదు. వీటికి లభించే స్పందన చూసి బీచ్లలో స్టార్ హోటళ్లు, రిసార్ట్స్కు కూడా అనుమతులు ఇచ్చే అవకాశం పరిశీలిస్తారు.