పారదర్శకంగా రెండు మద్యం బార్లకు లైసెన్సుల మంజూరు
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:59 AM
అనకాపల్లి జిల్లా పరిధిలోని నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన లైసెన్సుల ఎంపిక ప్రక్రియను గురువారం కలెక్టరేట్ సమావేశమందిరంలో పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించారు. లాటరీ ప్రక్రియను జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా పరిధిలో మొత్తం రెండు నోటిఫైడ్ బార్లకు గాను పది దరఖాస్తులు అందాయి.
- డీఆర్వో వై.సత్యనారాయణరావు
అనకాపల్లి కలెక్టరేట్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : అనకాపల్లి జిల్లా పరిధిలోని నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన లైసెన్సుల ఎంపిక ప్రక్రియను గురువారం కలెక్టరేట్ సమావేశమందిరంలో పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించారు. లాటరీ ప్రక్రియను జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా పరిధిలో మొత్తం రెండు నోటిఫైడ్ బార్లకు గాను పది దరఖాస్తులు అందాయి. లాటరీ నిర్వహించి ఇద్దరు విజేతలను ఎంపిక చేసి, ప్రతి బార్కు ఆర్1, ఆర్2 రిజర్వు అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. డ్రాలో ఎంపికైన అభ్యర్థులు రూ. 13.75 లక్షలు ఒక్కొక్కరు ఏఆర్ఈటీ చెల్లించి తాత్కాలిక లైసెన్సును పొందారు. పూర్తి లైసెన్స్ ఫీజును ఆరు వాయిదాలలో చెల్లించే వెసులుబాటు కల్పించగా, రెండు, మూడు సంవత్సరాల్లో లైసెన్స్ ఫీజు ఏటా 10 శాతం పెంపు ఉంటుందని సత్యనారాయణరావు పేర్కొన్నారు. లైసెన్స్ పొందిన వారు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, చట్టాలకు కట్టుబడి, నిర్ణీత ప్రాంగణాల్లోనే వ్యాపారం నిర్వహించాల్సి ఉంటుందన్నారు. విక్రయాలు, నిబంధనల అమలుపై నిశిత పర్యవేక్షణ చేపడతామని, ఉల్లంఘనలు జరిగితే శాఖాపరమైన చర్యలు తప్పవని డీఆర్వో ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి.సుధీర్, ఏఈ ఎస్ ఇతర అధికారులు, ఆశావహులు పాల్గొన్నారు.