టిప్పర్ లారీ బీభత్సం
ABN , Publish Date - Mar 29 , 2026 | 01:06 AM
రేబాక జాతీయ రహదారిపై శనివారం రాత్రి టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి వ్యాన్ డ్రైవర్ను ఢీకొనడంతో అతను మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి స్థానికులు, రూరల్ పోలీసులు తెలిపిన వివరాలివి. సబ్బవరం మండలం నారపాడు గ్రామానికి చెందిన సిమ్మసిరి నాగరాజు(33) వ్యాన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
అతివేగంగా వచ్చి ఢీకొనడంతో వ్యాన్ డ్రైవర్ మృతి
- ముగ్గురికి తీవ్ర గాయాలు
- మృతుని బంధువులు, గ్రామస్థుల ధర్నా
కొత్తూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రేబాక జాతీయ రహదారిపై శనివారం రాత్రి టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి వ్యాన్ డ్రైవర్ను ఢీకొనడంతో అతను మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి స్థానికులు, రూరల్ పోలీసులు తెలిపిన వివరాలివి. సబ్బవరం మండలం నారపాడు గ్రామానికి చెందిన సిమ్మసిరి నాగరాజు(33) వ్యాన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అనకాపల్లి వైపు వెళుతూ రేబాక కూడలి వద్ద ఆగి వాటర్ బాటిల్ కొనుగోలు చేసి వ్యాన్ వద్దకు వచ్చాడు. ఇంతలో సబ్బవరం నుంచి అనకాపల్లి వైపు అతివేగంగా వస్తున్న టిప్పర్ లారీ అతనిని ఢీకొనడంతో అతను లారీ టైరులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో వ్యాన్ ముందుకు దూసుకుపోవడంతో పక్కనే ఉన్న బైకు నుజ్జు కావడంతో పాటు నిల్చొని ఉన్న ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో టిప్పర్ లారీ డ్రైవర్ పరారయ్యాడు. మృతుని కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని తమకు న్యాయం చేయాలని టెంటు వేసి ధర్నాకు దిగారు. అనకాపల్లి రూరల్ సీఐ అశోక్కుమార్, ఎస్ఐ రవికుమార్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను నిలువరించి సంబంధిత లారీ యజమానితో చర్చిస్తున్నారు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అశోక్కుమార్ చెప్పారు. ఈ ప్రమాదంలో కాపుశెట్టివానిపాలెం గ్రామానికి చెందిన శేషాద్రి, తేజ, బాలాజీలకు తీవ్ర గాయాలు కావడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.