టెన్త్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత
ABN , Publish Date - Mar 15 , 2026 | 10:54 PM
అల్లూరి జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు.
జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్
పాడేరురూరల్, మార్చి 15(ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. ఆదివారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని 72 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ షాపులు పరీక్ష సమయంలో మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అనుమతి లేని వ్యక్తులను ఎట్టిపరిస్థితులలోనూ అనుమతించరన్నారు. విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశ్నపత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. మాస్ కాపీయింగ్, ఇతర అక్రమాలకు అవకాశం లేకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్ష సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు సమయం కంటే ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లాలో ఏ పరీక్ష కేంద్రం సమీపంలో అనుమానాస్పద సంఘటనలు జరిగినా వెంటనే 100 లేదా 112కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.