నూకాంబిక జాతరకు పటిష్ఠ బందోబస్తు
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:27 PM
నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర నెల రోజులపాటు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ తుహిన్సిన్హా తెలిపారు.
ఎస్పీ తుహిన్సిన్హా
అనకాపల్లి టౌన్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర నెల రోజులపాటు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ తుహిన్సిన్హా తెలిపారు. మంగళవారం ఆయన ఆలయానికి వచ్చి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. క్యూ లైన్లలో వుండే భక్తులు ఎండబారిన పడకుండా నీడ కల్పించాలని, చల్లని మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తోపులాట జరగకుండా చూడాలన్నారు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి వాహనాలను మళ్లించాలన్నారు. వాహనాల పార్కింగ్ స్థలాల వద్ద నిఘా ఉంచాలని ఆదేశించారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటివి జరగకుండా సివిల్ దుస్తుల్లో నిఘా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అంతకు ముందు ఆయన నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్ ఎస్పీని సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐలు జి.ప్రేమ్కుమార్, ఎం.వెంకట నారాయణ, ఎస్ఐ సంతోశ్కుమార్, తదితరులు వున్నారు.