Share News

పెట్రోలు, డీజిల్‌ కొరత లేదు

ABN , Publish Date - Apr 28 , 2026 | 01:11 AM

పెట్రోలు, డీజిల్‌ కొరత లేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా అన్నారు. వీరితోపాటు జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌ సోమవారం జలగలమదుం జంక్షన్‌లోని పెట్రోల్‌ బంకును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా అవసరాలకు సరిపడ పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు ఉన్నాయన్నారు.

పెట్రోలు, డీజిల్‌ కొరత లేదు
జలగలమదుం జంక్షన్‌ వద్ద పెట్రోల్‌ బంకును తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా

కలెక్టర్‌, ఎస్పీ వెల్లడి

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): పెట్రోలు, డీజిల్‌ కొరత లేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా అన్నారు. వీరితోపాటు జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌ సోమవారం జలగలమదుం జంక్షన్‌లోని పెట్రోల్‌ బంకును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా అవసరాలకు సరిపడ పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు ఉన్నాయన్నారు. ఆయిల్‌ కంపెనీల నుంచి నిరంతరం సరఫరా జరుగుతున్నదన్నారు. డీజిల్‌ కొరత ఏర్పడుతుందనే భయంతో ట్యాంకులను పూర్తిగా నింపుకోవద్దన్నారు. బంకుల యాజమానులు కృత్రిమ కొరత సృష్టించినా, వదంతులు వ్యాప్తి చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

కలెక్టర్‌ సమీక్ష

అనకాపల్లి కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా పరిస్థితులపై డీలర్లు, బంకుల యజమానులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని బంకుల్లో తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరాకు ఎటువంటి అంతరాయం లేదని తెలిపారు. ఆయిల్‌ డిపోల నుంచి రిటైల్‌ బంకులకు ఎలాంటి జాప్యం లేకుండా ట్యాంకర్లు చేరుకునే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్‌డీసీ సుబ్బలక్ష్మి, జిల్లా పౌరసరఫరాల అధికారి మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 01:11 AM