రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:09 AM
స్థానిక నూకాంబిక ఆలయ మండపంలో గురువారం శ్రీపరాభవ నామ సంవత్సర జిల్లాస్థాయి ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. దేవదాయ శాఖ జిల్లా అధికారి కేఎల్ సుధారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణన్, దినేశ్కుమార్ దంపతులు హాజరయ్యారు.
ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి
కలెక్టర్ విజయకృష్ణన్ ఆకాంక్ష
నూకాంబిక ఆలయంలో అధికారికంగా ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
పలువురు అర్చకులకు సత్కారం
అనకాపల్లి టౌన్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక నూకాంబిక ఆలయ మండపంలో గురువారం శ్రీపరాభవ నామ సంవత్సర జిల్లాస్థాయి ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. దేవదాయ శాఖ జిల్లా అధికారి కేఎల్ సుధారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణన్, దినేశ్కుమార్ దంపతులు హాజరయ్యారు. పండితులు డాక్టర్ ఆర్.జి.అప్పలాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ, శ్రీపరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఇందుకు నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు వుండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నూకాంబిక అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం, అమ్మవారి సన్నిధిలోనే ఉగాది పండుగను కుటుంబ సమేతంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు సీతారామస్వామి దేవాలయం అర్చకులు సుదర్శనం నారాయణచార్యులు, చీడికాడ మండలం ఖండివరం రామలింగేశ్వరస్వామి దేవాలయం అర్చకులు అయాలూరి భాస్కరరావు, అనకాపల్లి వేల్పులవీధి క్రాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయం అర్చకులు దొంతుకుర్తి సూర్యప్రకాశరావు, అనకాపల్లి గవరపాలెం నూకాలమ్మ వారి దేవాలయం అర్చకులు సింహభట్ల కామేశ్వరశర్మ, నర్సీపట్నం దుర్గామల్లీశ్వరస్వామి దేవాలయం అర్చకులు పేరి వెంకట నరసింహమూర్తి, ఎలమంచిలి వేణుగోపాలస్వామి దేవాలయం అర్చకులు గొడవర్తి కృష్ణమాచార్యులు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అర్చకులు లంబసింగి కృష్ణ, పాండవుల దేవాలయం అర్చకులు తరముల కొండలరావు, చింతపల్లి మండలం సీతారామాలయం అర్చకులు గడుతూరి రాజారావులను కలెక్టర్లు సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, దేవదాయ శాఖ ఉప కమిషనర్ సుజాత, ఆర్డీవో షేక్ ఆయీషా, కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, ఆలయ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ ఈవో వై.శ్రీధర్, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.