వృక్ష విలాపం..
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:54 AM
మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే.. మరోవైపు కొంతమంది వ్యక్తులు తమ వ్యాపార అవసరాల కోసం ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను నాశనం చేస్తున్నారు. నిలువునా ఎండిపోతున్న చెట్లను చూసి పలువురు ఆవేదన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే..
వాటర్ సర్వీసింగ్ సెంటర్లో కెమికల్ ట్యాంకర్ల క్లీనింగ్
రసాయన వ్యర్థ జలాలు బయటకు విడుదల
కెమికల్ ప్రభావంతో ఎండిపోతున్న చెట్లు
ఎస్.రాయవరం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే.. మరోవైపు కొంతమంది వ్యక్తులు తమ వ్యాపార అవసరాల కోసం ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను నాశనం చేస్తున్నారు. నిలువునా ఎండిపోతున్న చెట్లను చూసి పలువురు ఆవేదన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే..
మండలంలోని గోకులపాడు సమీపంలో జాతీయ రహదారి పక్కన వాహనాల వాటర్ సర్వీసింగ్ సెంటర్ వుంది. ఇక్కడ బైక్లు, కార్లు, వ్యాన్లు, లారీలతోపాటు రసాయనాలను రవాణా చేసే ట్యాంకర్లను కూడా శుభ్రం చేస్తుంటారు. మిగిలిన వాహనాల విషయం పక్కన పెడితే.. కెమికల్స్ను రవాణా చేసే ట్యాంకర్లను శుభ్రం చేసినప్పుడు వచ్చే రసాయన వ్యర్థాలతో కూడిన జలాలను జాతీయ రహదారి పక్కనే వున్న కాలువలోకి విడుదల చేస్తున్నారు. కాలువ గట్టుపైన వున్న పలు రకాల చెట్లు నిలువునా ఎండిపోయి మోడుగా మారాయి. అంతేకాక సర్వీసింగ్ సెంటర్ నుంచే బయటకు విడుదల చేసే వ్యర్థజలాల రోడ్డు పక్కన నిల్వ వుండి, తీవ్రదుర్వాసన వస్తున్నది. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చెట్లు ఎండిపోవడానికి కారణమైన వాటర్ సర్వీసింగ్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.