వంటశాలే తరగతి గది
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:34 AM
మండలంలోని మాదల పంచాయతీ డప్పుగుడ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
విద్యార్థులకు సరిపడా గదులు లేక ఇక్కట్లు
కనీస వసతులు లేని డప్పుగుడ ఎంపీపీ పాఠశాల
అరకులోయ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మాదల పంచాయతీ డప్పుగుడ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు సుమారు 50 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే మూడు గదులున్న ఈ పాఠశాల భవనంలో రెండు గదుల్లో నాలుగు తరగతులు, మరో గదిలో ఆఫీసు నిర్వహిస్తున్నారు. వంటశాల కోసం నిర్మించిన గదిలో మరో తరగతిని నిర్వహిస్తున్నారు. నలుగురు ఉపాధ్యాయులు, ఒక భాషా వలంటీర్ పాఠాలు బోధిస్తున్నారు. కాగా రెండు తరగతి గదుల్లో సరిపడా బెంచీలు లేకపోవడంతో కొందరు విద్యార్థులు నేలపైనే కూర్చుంటున్నారు. విద్యార్థులకు సరిపడా టీచర్లు ఉన్నప్పటికీ గదులు లేకపోవడంతో బోధన సక్రమంగా సాగడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అదనపు తరగతి గదులు నిర్మించడంతో పాటు ఈ భవనానికి మరమ్మతులు చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
.