ఇంటర్ పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్!
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:15 AM
జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు సకాలంలో పంపిణీ చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యావిభాగం అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.
- గోదాము నుంచి కళాశాలలకు అందజేత
- జూన్ 15 నాటికి విద్యార్థులకు పంపిణీ పూర్తి
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు సకాలంలో పంపిణీ చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యావిభాగం అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.
జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 3,515 మంది ప్రథమ, ద్వితీయ విద్యార్థులకు, 18 కేజీబీవీల్లో చదువుతున్న ద్వితీయ ఇంటర్ బాలికలు 798 మందికి, 5 హైస్కూల్ ప్లస్ స్కూల్స్లో చదువుతున్న ద్వితీయ ఇంటర్ విద్యార్థులు 447 మందికి, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో కళాశాలల్లో చదువుతున్న 573 మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేయనున్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ గోదాములో ద్వితీయ ఇంటర్ ఇంగ్లీషు పాఠ్యపుస్తకాలు 2,549, తెలుగు 2,248, హిందీ 301, లెక్కల పాఠ్యపుస్తకాలు 571, ఫిజిక్స్ 1,088, కెమిస్ట్రీ 1,088, బయాలజీ 517, హిస్టరీ 155, ఎకనామిక్స్ 550, సివిక్స్ 395, కామర్స్ 550, అకౌంట్స్ 550 పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. సుమారు 24 వేల నోట్ పుస్తకాలు ఉన్నాయి. గత ఏడాది విద్యార్థులకు ఇచ్చిన పాఠ్యపుస్తకాలను తిరిగి సేకరించిన అనంతరం ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు పెట్టిన ఇండెంట్ ప్రకారం జిల్లాలో కళాశాలలకు గోదాము నుంచి పుస్తకాలు పంపుతున్నారు. ప్రతి విద్యార్థికి గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆరు రూల్ నోటు పుస్తకాలు, ఆరు వైట్ నోటు పుస్తకాలు కూడా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే మండల కేంద్రాలకు పుస్తకాలు చేరవేస్తున్నారు. జూన్ 15వ తేదీ నాటికి ప్రతి విద్యార్థి చేతిలో ప్రభుత్వం ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు ఉండేలా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.