చిన్నారులకు సంపూర్ణ ఆరోగ ్యమే లక్ష్యం
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:14 AM
జిల్లాలో ఆరేళ్లలోపు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
కలెక్టర్ టి.నిషాంతి
వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి ఏఐ స్ర్కీనింగ్ శిక్షణ
పాడేరు, జూన్ 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆరేళ్లలోపు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. చిన్నారుల్లో వైకల్యాలను గుర్తించేందుకు ’నవచేతన’ కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ర్కీనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఆధునిక ఏఐ సాంకేతికతతో చిన్నారుల్లోని వైకల్యాలను ముందుగానే గుర్తించి, వాటిని నయం చేసేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చిన్న వయసులోనే వారిలోని ఆరోగ్య సమస్యలను గుర్తించడం ద్వారా వారికి సకాలంలో మెరుగైన వైద్య సేవలందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవకాశం కలుగుతుందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు నవచేతన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, అవసరమైన వైద్య సేవలు పొందేందుకు వారి తల్లిదండ్రులు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల సమగ్ర అభివృద్ధి, ఆరోగ్యం, పోషకాహారం, అభ్యాసనా సామర్థ్యాలు పెరుగుతాయన్నారు. ఐసీడీఎస్ పీడీ సీహెచ్.ఝాన్సీబాయి మాట్లాడుతూ సీడీపీవోలు, సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది ఈ ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారంతా మండల స్థాయిల్లో ఈ నెల 5 నుంచి 9 తేదీ వరకు అంగన్వాడీ కార్యకర్తలకు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఎంహెచ్వో టి.ప్రతాప్, స్థానిక జీజీహెచ్ హెచ్వోడీ డాక్టర్ చంద్రమోహన్, డాక్టర్ టీఎస్ఎన్.రాజు, డాక్టర్ శివకుమార్, సీడీపీవోలు, సూపర్వైజర్లు, వైద్యులు పాల్గొన్నారు.