Share News

మన్యంలో తగ్గని పొగమంచు

ABN , Publish Date - Apr 03 , 2026 | 11:01 PM

మన్యంలో వాతావరణం మార్పులతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఉదయం వేళల్లో మాత్రం పొగమంచు కురుస్తున్నది.

మన్యంలో తగ్గని పొగమంచు
పాడేరు-జి.మాడుగుల మార్గంలో శుక్రవారం ఉదయం పొగమంచు

పెరుగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

అరకులోయలో 16.1 డిగ్రీలు

పాడేరు, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): మన్యంలో వాతావరణం మార్పులతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఉదయం వేళల్లో మాత్రం పొగమంచు కురుస్తున్నది. మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రంగా కాస్తుండడంతోపాటు సాయంత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం సైతం కురుస్తున్నది. ఏజెన్సీలో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. ఆ తర్వాత నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండకాసి, అనంతరం ఆకాశం మేఘావృతమైంది. అలాగే పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

డబుల్‌ డిజిట్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత

మన్యంలో వాతావరణం మార్పులతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు డబుల్‌ డిజిట్‌లో కొనసాగుతున్నాయి. ఏజెన్సీలో శుక్రవారం అరకులోయలో 16.1 డిగ్రీల సెల్సియస్‌గా కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా ముంచంగిపుట్టులో 16.8, పెదబయలులో 17.2, చింతపల్లిలో 17.4, జి.మాడుగులలో 19.2, కొయ్యూరులో 20.5, అనంతగిరిలో 22.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 03 , 2026 | 11:01 PM