దారి కల చెదిరే..
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:05 AM
మండలంలోని తడిగిరి సచివాలయ పరిధిలోని బరెంగిబంద, కొండచీడిపుట్టు గ్రామాల రహదారుల నిర్మాణం పూర్తికాక మునుపే వర్షాలకు కోతకు గురయ్యాయి.
ఎన్నో ఏళ్లగా రహదారికి నోచుకోని బరెంగిబంద, కొండచీడిపుట్టు గ్రామాలు
కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.5.5 కోట్ల నిధులు మంజూరు
- అసంపూర్తిగా వదిలేసిన కాంట్రాక్టర్
వర్షాలకు కోతకు గురై దారుణంగా రోడ్లు
హుకుంపేట, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తడిగిరి సచివాలయ పరిధిలోని బరెంగిబంద, కొండచీడిపుట్టు గ్రామాల రహదారుల నిర్మాణం పూర్తికాక మునుపే వర్షాలకు కోతకు గురయ్యాయి. ఈ గ్రామాలకు ఎన్నో ఏళ్లగా రహదారి సౌకర్యం లేకపోవడంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలలకే రోడ్ల నిర్మాణానికి రూ.5.5 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభమై రెండేళ్లు గడిచినా కాంట్రాక్టర్ ఇప్పటికీ రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. దీంతో వర్షాలకు ఈ రోడ్లు రాళ్లు తేలి అధ్వానంగా తయారయ్యాయి. తమ గ్రామాలకు రహదారులు లేక ఎన్నో ఏళ్లగా ఇబ్బంది పడుతున్నామని, కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో తమ కష్టాలు తీరాయని భావించామని, తీరా ఇప్పుడు రోడ్లు కోతకు గురై దారుణంగా తయారయ్యాయని ఆయా గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ డోలీమోతలు తప్పడం లేదని వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ గ్రామాలకు పూర్తి స్థాయిలో రహదారులు నిర్మించాలని బరెంగిబంద, కొండచీడిపుట్టు గ్రామస్థులు కోరుతున్నారు.