రైతు సంక్షేమమే కూటమి ధ్యేయం
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:25 PM
రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధుల పంపిణీ
జిల్లాలో 1,03,864 మంది రైతులకు రూ.73.19 కోట్లు జమ
పాడేరు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి అన్నారు. శనివారం ‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్’ సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసే కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటూ వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తినా తక్షణమే స్పందించి వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రైతులకు ప్రయోజనం కలిగే ఎటువంటి కార్యక్రమాలను చేపట్టకపోవడం ఘోరమన్నారు. జిల్లాలోని 11 మండలాల్లో అన్నదాత సుఖీభవలో భాగంగా 1,03,864 మంది రైతులకు రూ.5వేలు చొప్పున రూ.51.93 కోట్లు, పీఎం కిసాన్ పథకంలో 1,06,233 మంది రైతులకు రూ.2 వేలు చొప్పున రూ. 21.26 కోట్లు జమ చేసిందన్నారు. ఈ రెండు పథకాల్లో మొత్తంగా రూ.73.19 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య మాట్లాడుతూ.. రైతుల అవసరాలు తీర్చుతూ వ్యవసాయాన్ని సంపూర్ణంగా ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, టూరిజం డైరెక్టర్ కిల్లు రమేశ్నాయుడు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కురుసా ఉమామహేశ్వరరావు, రైతులు అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ నమూనా చెక్ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, వ్యవసాయ శాఖ ఏడీ ప్రభాకరరావు, అగ్రికల్చర్ అసిస్టెంట్ టి.ప్రవీణ్కుమార్, పాడేరు, చింతపల్లి పీఏసీఎస్ల పర్సన్ ఇన్చార్జిలు డప్పోడి వెంకటరమణ, మంగతల్లి, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, టీడీపీ మహిళా నేతలు అల్లంగి సుబ్బలక్ష్మి, ఎల్.పార్వతమ్మ, డి.వెంకటకుమారి, జనసేన జిల్లా నేతలు కిట్లంగి పద్మ, బొంకుల దివ్యలత, రైతులు పాల్గొన్నారు.