నేడు కూటమి విజయభేరి
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:23 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం నిర్వహించనున్న ‘విజయభేరి’ సభకు భారీఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 50 మంది నేతలు ఆశీనులయ్యేలా వేదికను నిర్మించారు. ఎండకు, వర్షానికి ఇబ్బంది లేకుండా పార్టీల శ్రేణులు కూర్చోవడానికి భారీ పెండాల్ నిర్మించి, కుర్చీలు వేశారు. మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధిని, జిల్లాకు వస్తున్న పెట్టుబులు, పారిశ్రామిక అభివృద్ధిని ప్రతిబింబించేలా వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులతో వర్చువల్గా మాట్లాడేందుకు ఇక్కడ సభాప్రాంగణంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.
రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభ
ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి
ఉదయం తొమ్మిది గంటలకు మార్కెట్ యార్డు నుంచి ర్యాలీ
పది గంటలకు సభ ప్రారంభం
హాజరుకానున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు
అనకాపల్లి టౌన్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం నిర్వహించనున్న ‘విజయభేరి’ సభకు భారీఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 50 మంది నేతలు ఆశీనులయ్యేలా వేదికను నిర్మించారు. ఎండకు, వర్షానికి ఇబ్బంది లేకుండా పార్టీల శ్రేణులు కూర్చోవడానికి భారీ పెండాల్ నిర్మించి, కుర్చీలు వేశారు. మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధిని, జిల్లాకు వస్తున్న పెట్టుబులు, పారిశ్రామిక అభివృద్ధిని ప్రతిబింబించేలా వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులతో వర్చువల్గా మాట్లాడేందుకు ఇక్కడ సభాప్రాంగణంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కూటమి పార్టీలకు చెందిన జిల్లాస్థాయి నేతలు, ప్రభుత్వ శాఖల అధికారులు హాజరుకానున్నారు. డీసీఎంఎస్ కార్యాలయ ఆవరణను వాహనాల పార్కింగ్కు సిద్ధం చేశారు. సభకు హాజరయ్యే వారికి భోజనం, తాగునీరు, ఇతర ఏర్పాట్లపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి భీమరశెట్టి రామకృష్ణ (రాంకీ), గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర మంగళవారం వేదిక ప్రాంగణానికి వచ్చి చర్చించారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఎన్టీఆర్ మార్కెట్యార్డు నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. మెయిన్రోడ్డు, ఎన్టీఆర్ కూడలి మీదుగా ఎన్టీఆర్ స్టేడియంకు చేరుతుంది. పది గంటలకు సభావేదిక పైనుంచి విజయభేరి మోగించనున్నారు. జీవీఎంసీ ఇన్చార్జి జోనల్ కమిషనర్ డి.లక్ష్మీతులసీ ఆధ్వర్యంలో సభా ప్రాంగణమంతా శుభ్రం చేశారు. విజయభేరి సభ సాఫీగా సాగేందుకు పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఎంపీ సీఎం రమేశ్ మంగళవారం రాత్రి ఎన్టీఆర్ స్టేడియానికి వచ్చి విజయభేరి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, డీసీఎంఎస్ పర్సన్ ఇన్చార్జి కోట్ని బాలాజీ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, తదితరులు వున్నారు.