టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సందడి
ABN , Publish Date - Mar 29 , 2026 | 11:36 PM
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
వాడవాడలా రెపరెపలాడిన పసుపు జె ండా
పలు చోట్ల సేవా కార్యక్రమాలు
పాడేరు, మార్చి 29(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని మండల, పంచాయతీ, గ్రామ స్థాయిలో పార్టీ పండుగను ఘనంగా నిర్వహించారు. పాడేరు పాతబస్టాండ్లో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి పార్టీ జెండాను ఆవిష్కరించి, అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్కుమార్ స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటం వద్ద నివాళులర్పించి, కేకు కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన ఇంటి ముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ సీనియర్ నేతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టూరిజం డైరెక్టర్ కిల్లు రమేశ్నాయుడు, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, పార్టీ నేతలు చల్లంగి లక్ష్మణరావు, పాండురంగస్వామి, డప్పోడి వెంకటరమణ, సోమెలి చిట్టిబాబు, బుద్ద జ్యోతికిరణ్, తదితరులు పాల్గొన్నారు. అలాగే టూరిజం డైరెక్టర్ కిల్లు వెంకట రమేశ్నాయుడు ఆధ్వర్యంలో పాతపాడేరులో పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల పేదలకు దుస్తుల పంపిణీ, అన్నసమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. అరకులోయలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ దొన్నుదొర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలోని ప్రతి మండల, పంచాయతీ కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లోనూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.