నీటి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టండి
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:30 PM
జిల్లాలో నీటి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు.
12పిడిఆర్ 12: టి.నిశాంతి
అధికారులకు కలెక్టర్ నిశాంతి ఆదేశం
పాడేరు, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నీటి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. ఇటీవల అనంతగిరి మండలంలో గెడ్డలో మునిగి ముగ్గురు బాలికలు మృతి చెందడం, ఆదివారం పెదబయలు మండలంలోని మత్స్యగెడ్డలో మునిగి ముగ్గురు బాలురు మృతి చెందిన నేపథ్యంలో ఆమె అధికారులకు ఆదివారం రాత్రి అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. మండలాల వారీగా నీటి ప్రాంతాలను మ్యాపింగ్ చేయడం, జలపాతాలు, గెడ్డలు, చెరువులు, వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు, కంచెలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు నీటి ప్రమాదాలు, భద్రతపై అవగాహన కల్పించడం, ప్రజలను అప్రమత్తం చేయడం, పోలీస్, అటవీ శాఖల సిబ్బంది ద్వారా పహారాలను పెంచాలన్నారు. వారాంతంలో జలపాతాల వద్ద గస్తీ, అత్యవసర పరిస్థితులకు అంబులెన్స్లు, గజఈతగాళ్లను సిద్ధం చేయడం వంటివి చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక ప్రణాళికను రూపొందించి రోజువారీ నివేదికలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంతి ఆదేశించారు.