యువతి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Apr 16 , 2026 | 02:07 AM
వారంతా (ఇద్దరు యువతులు, ఐదుగురు యువకులు) స్నేహితులు. ఒక హోటల్కు వెళ్లారు. రెండు గదులు తీసుకుని సరదాగా గడుపుతుండగా, అందులో ఒక యువతికి మిగిలినవారికి మధ్య వాగ్వాదం జరిగింది. అందరూ కలిసి ఆమెపై దాడి చేసి తీవ్రంగా కొట్టి...ఆ గది నుంచి వేరొక గదిలోకి వెళ్లిపోయారు. దీనిని తీవ్ర అవమానంగా భావించిన యువతి తాను ఉంటున్న గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విశాలాక్షినగర్లోని ‘హోటల్బీ స్క్వేర్’లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తమపై దుష్ప్రచారం చేస్తోందని
ఆరుగురు స్నేహితుల దాడి
అవమానంతో హోటల్ గదిలో అఘాయిత్యం
నిందితుల్లో ఐదుగురు యువకులు, ఒక యువతి
విశాఖపట్నం/విశాలాక్షి నగర్/ఎండాడ,
ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి):
వారంతా (ఇద్దరు యువతులు, ఐదుగురు యువకులు) స్నేహితులు. ఒక హోటల్కు వెళ్లారు. రెండు గదులు తీసుకుని సరదాగా గడుపుతుండగా, అందులో ఒక యువతికి మిగిలినవారికి మధ్య వాగ్వాదం జరిగింది. అందరూ కలిసి ఆమెపై దాడి చేసి తీవ్రంగా కొట్టి...ఆ గది నుంచి వేరొక గదిలోకి వెళ్లిపోయారు. దీనిని తీవ్ర అవమానంగా భావించిన యువతి తాను ఉంటున్న గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విశాలాక్షినగర్లోని ‘హోటల్బీ స్క్వేర్’లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
జోడుగుళ్లపాలేనికి చెందిన ఆకుమరి శాంతికుమారి అలియాస్ జెస్సీ (27) పాలిటెక్నిక్ చదువుకుంది. డిప్లొమో చదువుతున్నప్పుడు అప్పుఘర్ప్రాంతానికి చెందిన వాసుపల్లి సాయికిరణ్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు సన్నిహితంగా ఉంటున్నారు. పాలిటెక్నిక్ తర్వాత సాయికిరణ్ లెండీ కాలేజీలో బీటెక్ చేశాడు. ఆ సమయంలో లాసన్స్బేకాలనీకి చెందిన వెంకటసాయియశ్వంత్, పంజాబ్ హోటల్ ప్రాంతానికి చెందిన రంప లక్ష్మీసౌజన్యసంజనతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఒకరిద్వారా మరొకరు అన్నట్టు బీబీఏ చదువుతున్న సీతమ్మధారకు చెందిన ఎన్.సాయికుమార్, కొత్తవలసకు చెందిన బైక్ మెకానిక్ పుచ్చా సాయికిరణ్, తిమ్మాపురంలోని కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న సింహాచలం ప్రాంతానికి చెందిన మణి స్నేహితులుగా మారారు. మంగళవారం రాత్రి సాయికిరణ్, వెంకటసాయి యశ్వంత్, ఎన్.సాయికుమార్ కలిసి విశాలాక్షి నగర్లోని తుకారం ఆలయ సమీపంలో ఉన్న హోటల్ బీస్క్వేర్లో ఒక గది బుక్ చేసుకున్నారు. ముగ్గురూ అక్కడ కూర్చుని మద్యంసేవించారు. అదే సమయంలో వాసుపల్లి సాయికిరణ్ తనతో సన్నిహితంగా ఉండే తన స్నేహితురాలైన శాంతికుమారికి ఫోన్ చేసి హోటల్కు రమ్మని పిలిచాడు. స్నేహితుల బర్త్డే ఫంక్షన్కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి శాంతికుమారి హోటల్కు వెళ్లింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికి మణి, పుచ్చా సాయికిరణ్ వచ్చారు. సాయికిరణ్ తన స్నేహితురాలైన సాయిసౌజన్యసంజనకు ఫోన్ చేసి హోటల్కు పిలిచాడు. ఏడుగురు కలవడంతో అదే హోటల్లో మరో గదిని బుక్ చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకున్నారు. కొందరు మద్యం సేవించారు. కాగా పుచ్చా సాయికిరణ్తో తనకు సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నావంటూ శాంతికుమారిని సాయిసౌజన్యసంజన నిలదీసింది. క్రమంగా శాంతికుమారికి మిగిలినవారికి మధ్య వాగ్వాదం పెరిగింది. అందరూ కలిసి శాంతికుమారిని కొట్టి అక్కడ నుంచి మరొక గదిలోకి వెళ్లిపోయారు. శాంతికుమారి మాత్రమే ఆ గదిలో ఉండిపోయింది. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన శాంతికుమారి హోటల్ గది తలుపు గడియపెట్టుకుని ఫ్యాన్కు ఉరేసుకుంది. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వాసుపల్లి సాయికిరణ్ వెళ్లి శాంతికుమారి ఉన్న గది తలుపు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి గునపంలాంటి ఇనుపరాడ్తో తలుపును విరగ్గొట్టాడు. శాంతికుమారి ఫ్యాన్కు వేలాడుతూ కొన ఊపిరితో ఉండడంతో ఆమెను ద్విచక్ర వాహనంపై వెంకోజీపాలెంలో గల కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించడంతో శాంతికుమారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారంతా ఆస్పత్రికి చేరుకుని ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ మల్లేశ్వరరావు వివరాలను సేకరించిన తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. తన కుమార్తెను స్నేహితులంతా తీవ్రంగా కొట్టడం వల్లే మృతిచెందిందని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసి, ఆరుగురు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీఐ తెలిపారు. పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామన్నారు.
ఫోటో : జెస్సీ మదర్ - రోదిస్తున్న మృతురాలి తల్లి రమ్య
నా కుమార్తెను హింసించి చంపారు
శాంతి కుమారి తల్లి రమ్య ఆరోపణ
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
మహారాణిపేట, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి):
తన కుమార్తెను నరకయాతన పెట్టి చంపారని, నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని శాంతికుమారి అలియాస్ జెస్సీ తల్లి రమ్య డిమాండ్ చేశారు. కేజీహెచ్లోని మార్చురీ వద్ద ఆమె కన్నీరుమున్నీరుగా విలపించారు. కొంతమంది స్నేహితులు పుట్టిన రోజు వేడుకలని తమ కుమార్తెను పిలిచి, హింసించి చంపేశారని ఆరోపించారు. ఎవరు చంపారో? ఎందుకు చంపారో? తెలియదు కాని తమకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె చాలా స్ట్రాంగ్ అని, తండ్రి మరణించిన తరువాత కుటుంబాన్ని అన్నీ తానై చూసుకుంటోందన్నారు. జెస్సీ సోదరి మాట్లాడుతూ తన సోదరి మంగళవారం రాత్రి 9:30 గంటలకు పుట్టిన రోజుకని వెళ్లిందని, ఉదయం ఐదు గంటల సమయంలో నరవ సాయికుమార్ అనే వ్యక్తి తమకు ఫోన్ చేసి మెడికవర్ ఆస్పత్రికి ఒకసారి రావాలని కోరినట్టు తెలిపింది. తాము వెంటనే ఆస్పత్రి వద్దకు వెళ్లగా, అక్కడి వైద్యులు అక్క మృతి చెందినట్టు చెప్పడంతో విస్మయానికి గురయ్యామని తెలిపింది. అక్క మృతదేహాన్ని చూశామని, దగ్గరగా పరిశీలించగా ఆమె పీక నులిమినట్టుగా ఉందని, మెడ అంతా కమిలిపోయి ఉందని, దవడలు మీద కొట్టినట్టు ఉండడంతో పాటు చేతిపై గాయాలు ఉన్నాయని తెలిపింది. తమ అక్కది హత్యేనని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరింది.