యువతి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:31 PM
మండలంలోని మాకవరం పంచాయతీ కేంద్రానికి సమీపంలో డుడుమ వెళ్లే ప్రధాన రహదారిలో మంగళవారం వనుగు సుమిత్ర(17) అనే గిరిజన యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నట్టు గురించామని ఎస్ఐ పి.నాని తెలిపారు.
ముంచంగిపుట్టు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మాకవరం పంచాయతీ కేంద్రానికి సమీపంలో డుడుమ వెళ్లే ప్రధాన రహదారిలో మంగళవారం వనుగు సుమిత్ర(17) అనే గిరిజన యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నట్టు గురించామని ఎస్ఐ పి.నాని తెలిపారు. దీనికి సంబంధించి ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాకవరం పంచాయతీ కేంద్రంలో సోమవారం రాత్రి గంగమ్మతల్లి జాతర జరిగింది. జాతర ముగించుకొని మంగళవారం ఉదయం గ్రామాలకు వెళుతున్న గిరిజనులకు డుడుమ మార్గంలో యువతి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ నాని సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి రోడ్డు పక్కన ఉన్న యువతి మృతదేహాన్ని పరిశీలించారు. కుంకుమ రంగు టాప్, తెలుపు రంగు ప్యాంట్, నలుపు రంగు చున్నీ ధరించి ఉంది. ఆమె తల, ముఖంపై బలమైన గాయాలు ఉండడాన్ని గుర్తించారు. ఆమె వివరాల కోసం ఆరా తీయగా మండలంలోని బరడ పంచాయతీ అడర్లడిముఖిపుట్టు గ్రామానికి చెందిన వనుగు సుమిత్రగా తెలిసింది. సుమిత్ర తండ్రి త్రినాథ్ పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని స్థానిక సీహెచ్సీకి తరలించామని, మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.