కేజీహెచ్ డాక్టర్ జనార్దనరావు సస్పెన్షన్
ABN , Publish Date - Jun 18 , 2026 | 01:00 AM
కేజీహెచ్ డాక్టర్ జనార్దనరావు సస్పెన్షన్
తమను వేధిస్తున్నట్టు పీజీ విద్యార్థినుల ఫిర్యాదు
విచారణ కమిటీ నివేదిక
ఆధారంగా చర్యలు తీసుకున్న డీఎంఈ
విశాఖపట్నం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్లో జనరల్ సర్జరీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.జనార్దనరావును సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) బుధవారం ఆదేశాలు జారీచేశారు. తమను ఆయన లైంగికంగా, మానసికంగా, వృత్తిపరంగా వేఽధిస్తున్నట్టు పీజీ విద్యార్థినులు ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవికి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఆమె విచారణకు ముగ్గురు వైద్యులతో కమిటీ వేశారు. అలాగే, కాలేజీలోని ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ విచారణ చేపట్టింది. ఈ రెండు కమిటీలు మంగళవారం పీజీ విద్యార్థినులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిని విచారించి ప్రిన్సిపాల్కు నివేదిక సమర్పించాయి. విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నట్టు గుర్తించిన త్రిసభ్య కమిటీ చర్యలకు సిఫారసు చేసింది. ఈ నివేదికను ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి మంగళవారం రాత్రి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు పంపించారు. ఈ మేరకు డాక్టర్ కె.జనార్దనరావును సస్పెండ్ చేస్తూ డీఎంఈ ఉత్తర్వులు జారీచేశారు. తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ను డీఎంఈ ఆదేశించారు. దీంతో వైద్య విద్యార్థినులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.