దేవరాపల్లి పీహెచ్సీ ఎంపీహెచ్ఎస్ (ఎం) సస్పెన్షన్
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:21 AM
దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీహెచ్ఎస్ (ఎం)గా పనిచేస్తున్న జీకే పుష్పరాజ్ను కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్వో డాక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు.
ఏఎన్ఎంను వేధిస్తున్నందుకు అధికారుల చర్యలు
అనకాపల్లి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీహెచ్ఎస్ (ఎం)గా పనిచేస్తున్న జీకే పుష్పరాజ్ను కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్వో డాక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్వాపరాలిలా వున్నాయి. ఎంపీహెచ్ఎస్ (ఎం) పుష్పరాజ్ వేధింపులతో గర్శింగి సచివాలయం ఏఎన్ఎంగా పని చేస్తున్న గుజ్జెలి రాజ్యలక్ష్మి ఈ ఏడాది మార్చి 29వ తేదీ రాత్రి మోతాదుకు మించి డోలో మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను పాడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. ఎంపీహెచ్ఎస్ (ఎం) పుష్పరాజ్పై ఆమె పాడేరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును దేవరాపల్లి స్టేషన్కు బదిలీచేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తరువాత రాజ్యలక్ష్మికి అండగా నిలిచిన మిగిలిన ఏఎన్ఎంలను పుష్పరాజు పరోక్షంగా బెదిరిస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఏప్రిల్ 9న కలెక్టరేట్, డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట ఏఎన్ఎంలు ఆందోళనలు చేశారు. ఇదే సమయంలో కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ఏఎన్ఎం గుజ్జెలి రాజ్యలక్ష్మిని ఎంపీహెచ్ఎస్ (ఎం) పుష్పరాజ్ వేధించినట్టు నిర్ధారణ కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్వో సస్పెండ్ చేశారు. ఈ మేరకు మూడు రోజల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు.