సర్ పెండింగ్ ప్రక్రియ వేగవంతం
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:20 PM
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ టి.నిషాంతి ఆదేశం
పాడేరు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. సర్పై ఎన్నికల సంబంధ అధికారులతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సర్లో భాగంగా జూలై 31న ప్రచురించిన ముసాయిదా ఎన్నికల జాబితాలోని అభ్యంతరాలు, ఇతర క్లయిమ్లను పరిశీలించి సెప్టెంబరు 28లోగా వాటిని పరిష్కరించాలన్నారు. జిల్లాలో అరకులోయ మండలం పరిధిలోనే ఎక్కువగా పెండింగ్ కేసులున్నాయని, వాటిని పక్కాగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. సర్కు సంబంధించిన అన్ని ప్రక్రియలను నిర్దేశించిన గడువు నాటికి పూర్తి చేసి, అక్టోబరు 3న తుది ఓటరు జాబితాలను ప్రకటించాలని, అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి సమన్వయం చేసుకుని ఆయా పెండింగ్ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఆర్డీవో ఎం.భుజంగరావు పాల్గొన్నారు.