అదనపు కోర్టులతో సత్వర న్యాయం
ABN , Publish Date - May 04 , 2026 | 12:52 AM
అదనపు కోర్టులతో సత్వర న్యాయం
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ
నర్సీపట్నంలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, రెండవ అదనపు సివిల్ జడ్జి కోర్టులు ప్రారంభం
హాజరైన మరో న్యాయమూర్తి జస్టిస్ రవి చీమలపాటి
నర్సీపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి): కేసులకు సత్వర పరిష్కారం చూపి, కక్షిదారులకు త్వరగా న్యాయం చేయడం కోసమే అదనపు కోర్టులు మంజూరు చేసినట్టు హైకోర్టు న్యాయమూర్తి, విశాఖ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ అన్నారు. ఆదివారం నర్సీపట్నంలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, రెండవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి రవి చీమలపాటితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ రవినాథ్ తిల్హారీ మాట్లాడుతూ, అదనపు కోర్టులతో కేసులు త్వరగతి పరిష్కారం జరిగి సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు. జూనియర్ న్యాయవాదులు వృత్తిపట్ల అంకిత భావంతో పని చేయాలని, సీనియర్లను గౌరవించాలని సూచించారు. జస్టిస్ రవి చీమలపాటి మాట్లాడుతూ, తల్లిదండ్రుల తర్వాత విద్య నేర్పిన గురువుని గౌరవించాలని అన్నారు. న్యాయవాద వృత్తిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం చాలా సులభమని అన్నారు. విధి నిర్వహణను దైవంగా భావించి పని చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా రూ.3.09 కోట్లతో నిర్మించనున్న అదనపు కోర్టు భవన నిర్మాణ పనులకు జిల్లా ప్రధాన న్యాయూర్తి చిన్నంశెట్టి రాజు భూమి పూజ చేశారు. అంతకుముందు ఇక్కడకు వచ్చి హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా ప్రధాన న్యాయూర్తి చిన్నంశెట్టి రాజు, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) పి.షియాజ్ ఖాన్, బార్ సోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులను జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, నర్సీపట్నం ఇన్చార్జ్ డీఎస్పీ ఇ.శ్రీనివాసులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్టా ప్రభాకరరావు, కార్యదర్శి అనిమిరెడ్డి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.