గిరి రైతుల ఆదాయాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:08 AM
గిరిజన రైతుల ఆదాయాన్ని అభివృద్ధి చేసేందుకు, గిరిజన ఉత ్పత్తుల అభివృద్ధి, బ్రాండింగ్, మార్కెటింగ్పై అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు.
సీఎం చంద్రబాబునాయుడు ఆదేశం
రాష్ట్ర ప్రగతి సమీక్షలో వర్చువల్గా పాల్గొన్న కలెక్టర్ దినేశ్కుమార్, ఇన్చార్జి జేసీ శ్రీపూజ, తదితరులు
కాఫీ తోటల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం అనుసంధానించాలని కోరిన కలెక్టర్
పాడేరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): గిరిజన రైతుల ఆదాయాన్ని అభివృద్ధి చేసేందుకు, గిరిజన ఉత ్పత్తుల అభివృద్ధి, బ్రాండింగ్, మార్కెటింగ్పై అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. గిరిజన ప్రాంతంలో పండే కాఫీ, మిరియాలు, పసుపు పంటలను మరింతగా ప్రమోట్ చేయాలని, ప్రపంచ ఖ్యాతిగాంచిన అరకు కాఫీ, నాణ్యమైన మిరియాల సాగును మరింతగా విస్తరించాలని, తర్వాత గిరిజన రైతుల ఆదాయం పెరగాలన్నారు. గిరిజన ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకు రావడమే కాకుండా వాటిని పండించే రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలన్నారు. చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలో కుంకుమ సాగుకు అనుకూలతపై కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్తో సీఎం చంద్రబాబునాయుడు చర్చించారు. అక్కడ వాతావరణ పరిస్థితులు, సాగు ప్రక్రియలపై పైలట్ ప్రాజెక్టుగా ప్రయోగత్మకంగా కుంకుమ పువ్వు సాగు చేపట్టాలన్నారు. దానిని విజయవంతం చేసి కుంకుమపువ్వు సాగుతో గిరిజనులకు ఉపాధి, ఆదాయం సమకూరాలన్నారు. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించి, పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధిలో బి- గ్రేడులో ఉన్నామని, అవసరమైన చర్యలు చేపట్టి, ఏ-గ్రేడు సాధిస్తామని, అల్లూరి, పోలవరం జిల్లాల్లో 40 వేల ఎకరాలు గడ్డి ఉన్న ప్రాంతముందని, దానిని వినియోగించి ఉద్యాన పంటల సాగులో ప్రగతి సాధిస్తామని చెప్పారు. అలాగే కాఫీ తోటల అభివృద్ధికి జాతీయ ఉపాధి హామీ పథకంలో అనుసంధానానికి అనుమతులు కావాలని కలెక్టర్ కోరగా, సీఎం సానుకూలంగా స్పందించి డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్తో చర్చించి చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో సీసీ రోడ్లు, గోకులాల షెడ్లు, తదితర నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ట్రైనీ ఐఏఫ్ఎస్ చిదానందం, డీఆర్వో పి.అంబేడ్కర్, డీఆర్డీఏ పీడీ వి.మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.