ఆక్రమణలను క్రమబద్ధీకరించండి
ABN , Publish Date - May 21 , 2026 | 12:50 AM
గాజువాక నియోజకవర్గంలో ఐటీ, ఇతర పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఇతర అధికారులను కోరినట్టు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ తన ఛాంబర్లో ఎమ్మెల్యే పల్లాతో కలిసి గాజువాక నియోజకవర్గ సమస్యలపై పలు శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.
కలెక్టర్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు,
గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విజ్ఞప్తి
యారాడ కొండపై ఐటీ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
ఉక్కు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి):
గాజువాక నియోజకవర్గంలో ఐటీ, ఇతర పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఇతర అధికారులను కోరినట్టు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ తన ఛాంబర్లో ఎమ్మెల్యే పల్లాతో కలిసి గాజువాక నియోజకవర్గ సమస్యలపై పలు శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం విలేకరులతో పల్లా మాట్లాడుతూ యారాడ కొండపై 400 ఎకరాల్లో ఐటీ, ఐటీ ఆధారిత, ఎలకా్ట్రనిక్ పరిశ్రమలకు కేటాయిస్తే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. అలాగే గాజువాకలో ఏళ్ల కిందట గెడ్డలు, వాగులకు ఆనుకుని నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరించాలని కోరారు. దీనివల్ల గాజువాకలో సుమారు ఆరు వేల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయన్నారు. గాజువాకలో మీడియా ముసుగులో కొందరు ముఠాలుగా ఏర్పడి ఇళ్లు నిర్మిస్తున్న వారిని ఇబ్బంది పెడుతున్నారని పల్లా ఆందోళన వ్యక్తంచేశారు. అటువంటి వారిపట్ల జీవీఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే చర్యలు తీసుకోవాలని కోరారు.
విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేలా అధికారులు చొరవ తీసుకోవాలని పల్లా శ్రీనివాసరావు కోరారు. ఇంకా 600 మంది నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఉక్కు భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ పేర్కొన్నారని, అయితే నిర్వాసిత కాలనీల్లో ఆక్రమణలు, మిగిలిన ఇళ్ల స్థలాలు, ఇంకా ఎంత మందికి ఉద్యోగాలు ఇవ్వాలి?, సబ్ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదైన వివరాలపై ఒక నివేదిక సిద్ధం చేయాలని కోరారు. ఉక్కు భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం పనితీరు మార్చుకోవాలన్నారు. ఫార్మా సిటీ నిర్వాసితుల్లో ఇంకా 300 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో ఏపీఐఐసీ అధికారులు చొరవ తీసుకుని వారి సమస్య పరిష్కరించాలన్నారు. అగనంపూడి టోల్గేటు సమీపాన ఏపీ రిఫ్రాక్టరీస్కు చెందిన 175 ఎకరాల భూమిని వినియోగించాలని, లేకపోతే ఆక్రమణలకు గురవుతుందన్నారు.