విద్యా సంస్థలకు సౌరభాలు
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:35 AM
విద్యా సంస్థల్లో సౌర విద్యుత్తు ఉత్పత్తి, వినియోగం ద్వారా పాఠశాలలపై కరెంటు బిల్లుల భారం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, తదితర విద్యా సంస్థల భవనాలపై సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది. తొలివిడత జిల్లాలో 361 ప్రభుత్వ విద్యా సంస్థలను ఎంపిక చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు
తొలివిడత 361 స్కూళ్లలో ఏర్పాటు
పాఠశాల భవనం శ్లాబ్ ఏరియా, విద్యుత్ వినియోగం వివరాలను సేకరిస్తున్న అధికారులు
6 కేవీ నుంచి 11 కేవీ వరకు యూనిట్లు బిగించే అవకాశం
విద్యా శాఖకు విద్యుత్తు బిల్లులు ఆదా
నర్సీపట్నం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): విద్యా సంస్థల్లో సౌర విద్యుత్తు ఉత్పత్తి, వినియోగం ద్వారా పాఠశాలలపై కరెంటు బిల్లుల భారం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, తదితర విద్యా సంస్థల భవనాలపై సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది. తొలివిడత జిల్లాలో 361 ప్రభుత్వ విద్యా సంస్థలను ఎంపిక చేశారు. వీటిలో జీడ్పీ/ ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, కేజీబీవీలు, ఏపీఆర్ఎస్లు, ఏపీ మోడల్ స్కూళ్లు, జూనియర్ కళాశాలలు వున్నాయి. ఆయా పాఠశాలల్లోని భవనాల శ్లాబ్ ఏరియా, నెల వారీ విద్యుత్ వినియోగం, బిల్లు ఎంత వస్తున్నది.. తదితర వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులు, ఆయా విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులు/ ప్రిన్సిపాళ్ల నుంచి తీసుకుంటున్నారు. ఈ వివరాలను క్రోడీకరించిన తరువాత 6 కేవీ నుంచి 11 కేవీ వరకు సోలార్ యూనిట్లను బిగించే అవకాశం వుంది. దీనివల్ల విద్యుత్తు బిల్లులు ఆదా అయి, పాఠశాలలపై ఆర్థిక భారం తగ్గుతుంది. మిగులు విద్యుత్తును ఈపీడీసీఎల్కు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం వుంది.
సోలార్ యూనిట్లకు ఎంపికైన పాఠశాలలు..
అనకాపల్లి మండలంలో 27, అచ్యుతాపురంలో 16, బుచ్చెయ్యపేట 15, చీడికాడ 13, చోడవరం 18, దేవరాపల్లి 13, గొలుగొండ 12, కె.కోటపాడు 12, కశింకోట 9, కోటవురట్ల 13, మాకవరపాలెం 13, మునగపాక 11, నక్కపల్లి 16, నర్సీపట్నం 19, నాతవరం 11, పరవాడ 14, పాయకరావుపేట 17, రాంబిల్లి 16, రావికమతం 19, రోలుగుంట 12, ఎస్.రాయవరం 23, సబ్బవరం 11, వి.మాడుగుల 15, ఎలమంచిలి 15 చొప్పున ఎంపిక చేశారు.