ఎడ్సెట్లో మెరిశారు
ABN , Publish Date - May 27 , 2026 | 12:08 AM
ఎడ్సెట్-2026 ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో సత్తా చాటారు. నాలుగు సబ్జెక్టుల్లో ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో పది లోపు ర్యాంకులు సాధించారు. ఎస్.రాయవరానికి చెందిన గొంపా శివగణేశ్ ఇంగ్లిషులో 122 మార్కులతో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు.
జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు
అనకాపల్లి, మే 26 (ఆంధ్రజ్యోతి): ఎడ్సెట్-2026 ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో సత్తా చాటారు. నాలుగు సబ్జెక్టుల్లో ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో పది లోపు ర్యాంకులు సాధించారు. ఎస్.రాయవరానికి చెందిన గొంపా శివగణేశ్ ఇంగ్లిషులో 122 మార్కులతో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. నక్కపల్లి మండలం అమలాపురానికి చెందిన వంకా మహేశ్ మ్యాథమేటిక్స్ విభాగంలో 111 మార్కులతో 5వ ర్యాంకు, సబ్బవరం మండలానికి చెందిన మరడపూడి ఉదయకుమారి 106 మార్కులతో 9వ ర్యాంకు, ఎలమంచిలి మునిసిపాలిటీలోని పెద్దపల్లి ప్రాంతానికి చెందిన దొడ్డి చాందిని ఫిజికల్ సైన్స్లో 107 మార్కులతో 4వ ర్యాంకు, రావికమతం మండలం ధర్మవరం గ్రామానికి చెందిన నీలాపు రాజీవ్శ్రీను సోషల్ స్టడీస్ విభాగంలో 112 మార్కులతో 2వ ర్యాంకు సాధించారు.
నక్కపల్లి మండలం అమలాపురంలో మత్స్యకార కుటుంబానికి చెందిన వంకా మహేశ్ ఇటీవల ఎమ్మెస్సీ పూర్తిచేశారు. ప్రస్తుతం పాయకరావుపేటలో ఒక కార్పొరేట్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. రావికమతం మండలం ధర్మవరం గిరిజన గ్రామానికి చెందిన నీలాపు రాజీవ్ శ్రీనుది వ్యవసాయ కుటుంబం. ఇతను దూర విద్యలో డిగ్రీ పూర్తిచేసి, ఏపీపీఎస్సీ నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రాత పరీక్షలో అర్హత సాధించాడు. అయితే ఈ ఫలితాలపై కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ఇంటర్వ్యూ ఆగిపోయింది. ఎస్.రాయవరం గ్రామానికి చెందిన గొంప శివగణేశ్ ఎంఏ, పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం అడ్డురోడ్డులోని ఒక కళాశాలలో ఇంగ్లిషు అధ్యాపకునిగా పనిచేస్తున్నారు.