లాంగ్లీవ్లో ఎస్డీసీ నీలకంఠరావు
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:19 PM
కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ విభాగం నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.నీలకంఠరావు దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారని విశ్వసనీయంగా తెలిసింది.
ప్రస్తుతం వారం రోజులు సెలవు
అనంతరం దీర్ఘకాలిక సెలవు పెట్టనున్న ఎస్డీసీ
డీఈవో బాటలో మరో జిల్లా స్థాయి అధికారి
సంబంధం లేని పనులు కలెక్టర్ అప్పగింతపై మనస్తాపం
పాడేరు, జూన్ 12(ఆంధ్రజ్యోతి):
కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ విభాగం నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.నీలకంఠరావు దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారని విశ్వసనీయంగా తెలిసింది. గతంలో ఇక్కడే జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం కలెక్టరేట్లోనే పీజీఆర్ఎస్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనకు రెవెన్యూ, పీజీఆర్ఎస్ పనులు కాకుండా తన విధులకు సంబంధం లేని పనులు అప్పగించడంతో మనస్తాపానికి గురైన ఈనెల 10వ తేదీ నుంచి వారం రోజులు సెలవు పెట్టారు. అలాగే వారం తర్వాత దీర్ఘాకాలిక సెలవులో వెళ్లిపోతారని తెలిసింది. ఇక్కడే జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేసిన జిల్లా స్థాయి అధికారిని అవమానకరంగా చూస్తూ, సంబంధం లేని పనులు అప్పగించడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని కలెక్టరేట్లో పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవలే జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ కె.రామకృష్ణారావు సైతం జిల్లా కలెక్టర్ వైఖరికి మనస్తాపానికి గురై దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోవడంతో టీడబ్ల్యూ డీడీ పరిమిళకు డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆ వైనాన్ని మరువక ముందు మరో జిల్లా స్థాయి అధికారి నీలకంఠారావు డీఈవో బాటలోనే పయనించడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.