పరిశ్రమల్లో భద్రతకు అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - May 15 , 2026 | 11:55 PM
ఫార్మా పరిశ్రమల్లో భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని ఫ్యాక్టరీస్ జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ జె.శివశంకర్రెడ్డి సూచించారు.
ఫ్యాక్టరీస్ జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ జె.శివశంకర్రెడ్డి
పరవాడ, మే 15 (ఆంధ్రజ్యోతి): ఫార్మా పరిశ్రమల్లో భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని ఫ్యాక్టరీస్ జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ జె.శివశంకర్రెడ్డి సూచించారు. రసాయన ప్రమాదాల నియంత్రణ, భద్రతా ప్రమాణాల ప్రాముఖ్యత అనే అంశంపై ఫార్మా పరిశ్రమల ప్రతినిధులు, కార్మికులతో శుక్రవారం ఎంఏఎస్ఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భద్రతపై ఎప్పటికప్పుడు కార్మికులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరికీ ప్రాణ నష్టం కలగకుండా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఎస్.శంకర్నాయక్ పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా పలు సలహాలు, సూచనలు చేశారు. టోరెంటో ఫార్మా, మహీ డ్రగ్స్, ర్యాక్ ఫార్మా, సినర్జిన్ ఫార్మా యాజమాన్యాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పీసీబీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీవీ ముకుందరావు, జిల్లా రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఆర్.వెంకటరమణ, జేఎన్పీసీ మాన్యుఫ్యాక్చర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.సూర్యప్రకాశరావు, ఎంఏఎస్ఆర్ఎం కార్యదర్శి జెట్టి సుబ్బారావు, లారస్ ల్యాబ్స్ ప్రతినిధి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.