30 గ్రామాల ప్రజలకు ఊరట
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:36 PM
మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ జీలుగులపాడు సమీపంలో గోస్తని నదిపై వంతెన నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావడంతో 30 గ్రామాల ప్రజలకు రవాణా కష్టాలు తీరాయి.
ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చిన జీలుగులపాడు వంతెన
తీరిన గిరిజనుల రవాణా కష్టాలు
అనంతగిరి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ జీలుగులపాడు సమీపంలో గోస్తని నదిపై వంతెన నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావడంతో 30 గ్రామాల ప్రజలకు రవాణా కష్టాలు తీరాయి. భారీ వర్షాలు కురిసేటప్పుడు నాటు పడవలపై గిరిజనులు ఎన్నో దశాబ్దాలుగా ప్రయాణాలు సాగించారు. గోస్తని నదిని దాటే క్రమంలో పలువురు మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వంలో వంతెన నిర్మాణానికి ఎస్సీఏ గ్రాంటు కింద రూ.2.2 కోట్లు కేటాయించింది. అయితే 70 శాతం వరకు పనులు వేగంగా సాగినప్పటికీ ఆ తరువాత వివిధ కారణాలతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వంతెన నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. మూడు నెలల క్రితం వంతెన పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. దీంతో జిల్లాలోని చిలకలగెడ్డ, రొంపల్లి పంచాయతీల్లోని మర్రివలస, పసిని, గాదిల్లోవ, చినరాభ,పెదరాభ, సోట్టాడివలస, దబ్బలపాడు, కోటపర్తివలస, రొంపల్లి, కరకవలస గ్రామాలతో పాటు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం డీకేపర్తి, ముసలకండి, అడ్డతీగ, బీటుగరువు, రేగలపాలెం, అలిపర్తి, ఎగువకొండపర్తి, పెదపాడు, గ్రామాల గిరిజనులకు రవాణా కష్టాలు తీరాయి.