Share News

రేషన్‌ పక్కదారి

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:21 AM

ఏప్రిల్‌ నెల రేషన్‌ సరుకుల పంపిణీ ప్రారంభం కాకముందే పాయకరావుపేటలోని ఒక రేషన్‌ డిపో డీలర్‌ సరుకులను పక్కదారి పట్టించారు.

రేషన్‌ పక్కదారి
రేషన్‌ డిపోలో స్టాకు వివరాలను పరిశీలిస్తున్న తహశీల్దారు మహేశ్వరరావు, పౌరసరఫరాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బోడపాటి శివదత్‌, ఆర్‌ఐ త్రినాథ్‌

పట్టుకున్న స్థానికులు.. అధికారులకు ఫిర్యాదు

రేషన్‌ డిపోలో తనిఖీలు

106 కిలోల రాగులు, 48 కిలోల పంచదార తక్కువ ఉన్నట్టు నిర్ధారణ

రేషన్‌ డీలర్‌పై 6ఏ కేసు నమోదు

పాయకరావుపేట, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఏప్రిల్‌ నెల రేషన్‌ సరుకుల పంపిణీ ప్రారంభం కాకముందే పాయకరావుపేటలోని ఒక రేషన్‌ డిపో డీలర్‌ సరుకులను పక్కదారి పట్టించారు. ఇది గమనించిన స్థానికులు అక్రమంగా తరలిస్తున్న సరుకులను పట్టుకొని అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుడైన రాష్ట్ర పౌరసరఫరా కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బోడపాటి శివదత్తు, తహశీల్దారు మహేశ్వరరావు వచ్చి రేషన్‌ డిపోలో తనిఖీలు చేపట్టారు. 106 కిలోల రాగులు, 48 కిలోల పంచదార తక్కువ ఉన్నట్టు గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. పాయకరావుపేట ఎల్‌టీ కాలనీలో ఉన్న రేషన్‌ షాపు నంబర్‌-3కు సంబంధించిన డీలర్‌, ఏప్రిల్‌ నెలలో కార్డుదారులకు పంపిణీ చేయడానికి బియ్యం, రాగులు, పంచదారను ఇటీవల ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి విడిపించారు. బుధవారం నుంచి వీటిని కార్డుదారులకు అందజేయాల్సి వుంది. అయితే ఒక రోజు ముందుగానే మంగళవారం కొంతమంది వ్యక్తులు రేషన్‌ డిపో నుంచి మూటలు తీసుకెళుతుండడాన్ని స్థానికులు గుర్తించి అడ్డగించారు. అప్పటికే కొన్ని మూటలు తరలించగా, రెండు రాగుల మూటలను పట్టుకొని అధికారులకు సమాచారం అందించారు. తహశీల్దారు మహేశ్వరరావు, ఆర్‌ఐ త్రినాథ్‌తోపాటు రాష్ట్ర పౌరసరఫరా కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బోడపాటి శివదత్తు రేషన్‌ డిపో వద్దకు వచ్చి తనిఖీలు చేపట్టారు. రికార్డుల్లో వున్న స్టాకుకు, డిపోలో వున్న సరుకులకు మధ్య వ్యత్యాసం వున్నట్టు గుర్తించారు. 106 కిలోల రాగులు, 48 కిలోల పంచదార తక్కువ వున్నట్టు నిర్ధారించారు. రేషన్‌ డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 01 , 2026 | 12:21 AM