Share News

శరవేగంగా హైవే నిర్మాణం

ABN , Publish Date - Sep 08 , 2026 | 01:22 AM

విశాఖపట్నం-రాయపూర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

శరవేగంగా హైవే నిర్మాణం

చురుగ్గా సాగుతున్న విశాఖ- రాయపూర్‌ ఆరు లేన్ల రోడ్డు పనులు

చిన్నయ్యపాలెం వద్ద పూర్తయిన అనకాపల్లి- ఆనందపురం హైవే అనుసంధానం

సూరెడ్డిపాలెం వద్ద డబుల్‌ ట్రంపెట్‌ నిర్మాణం

సబ్బవరం- షీలానగర్‌ రోడ్డు ఎనిమిది నెలల్లో పూర్తి

సబ్బవరం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం-రాయపూర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను అనుసంధానం చేసే ఈ రహదారి పనులు అననకాపల్లి జిల్లా పరిధిలో దాదాపు పూర్తయ్చాయి. సిగ్నిల్స్‌, నేమ్‌ బోర్డులు, హెచ్చరిక బోర్డులు, సీసీ కెమెరాలు, రాత్రిపూట లైటింగ్‌ కోసం సౌర పలకలను ఏర్పాటు చేశారు. ఆరు వరుసలుగా నిర్మిస్తున్న ఈ రహదారిలో డివైడర్‌ నిర్మాణం కూడా పూర్తయ్యింది. అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిని కలుపుతూ సబ్బవరం సమీపంలో చిన్నయ్యపాలెం వద్ద ఇంటర్‌ చేంజ్‌ (ట్రంపెట్‌) నిర్మాణ పనులు చివరిదశకు చేరాయి. రాయపూర్‌ నుంచి విశాఖ నగరంలోకి వెళ్లే వాహనాలు చిన్నయ్యపాలెం ఇంటర్‌చేంజ్‌ నుంచి సుమారు కిలోమీటరు దూరం నుంచి అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారి మీదుగా అమృతపురం శివారు సూరెడ్డిపాలెం వరకు ప్రయాణిస్తాయి. ఇక్కడ నుంచి సబ్బవరం- షీలానగర్‌ సాగరమాల (పోర్టు కనెక్టవిటీ) రోడ్డు మీదుగా విశాఖకు వెళతాయి. ఇందుకోసం సూరెడ్డిపాలెం డబుల్‌ ట్రంపెట్‌ నిర్మిస్తున్నారు. మరో ఎనిమిది నెలల్లో సబ్బవరం- షీలానగర్‌ సాగరమాల రోడ్డు అందుబాటులోకి వస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు.

మూడు రాష్ట్రాల మీదుగా హైవే..

విశాఖ- రాయపూర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే మొత్తం పొడవు 464 కిలోమీటర్లు. ఇందులో 100 కి.మీ. ఏపీలో, 240 కి.మీ. ఒడిశాలో, 124 కి.మీ. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో వున్నాయి. ఏపీలో రహదారి నిర్మాణ పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. ఏపీలో పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మినహా మిగిలిన చోట్ల రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. విశాఖ- రాయపూర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం చిన్నయ్యపాలెం వద్ద ప్రారంభమై, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయపూర్‌ సమీపంలో అభన్‌పూర్‌ వద్ద ముగుస్తుంది. చిన్నయ్యపాలేనికి ఏడు కిలోమీటర్ల దూరంలో గులివిందాడ- చీపురువలస మధ్య టోల్‌ ప్లాజా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రహదారికి సర్వీసు రోడ్లు ఉండవు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, చిన్నపాటి గూడ్స్‌ వ్యాన్‌లను ఈ రోడ్డుపైకి అనుమతించరు. సబ్బవరం- షీలానగర్‌ సాగరమాల రోడ్డు నిర్మాణం కూడా పూర్తయితే రాయపూర్‌- విశాఖ మధ్య దూరం 80 కిలోమీటర్లు, ప్రయాణ సమయం ఆరు గంటల వరకు తగ్గుతుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Sep 08 , 2026 | 01:22 AM