ఆస్తి పన్ను వసూళ్లు ఆశాజనకం
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:04 AM
జీవీఎంసీ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి.
2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రైవేటు అసెస్మెంట్ల నుంచి రూ.566.41 కోట్లు వసూలు లక్ష్యం
ఇప్పటివరకూ రూ.348.65 కోట్లు రాక
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు చెందిన సంస్థల నుంచి రూ.17.15 కోట్లు
వీఎల్టీ కింద మరో రూ.38.86 కోట్లు వసూలు
గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే రూ.97 కోట్లు అధికంగా వసూలు
మార్చి నెలాఖరులోగా మరో రూ.300 కోట్లు వసూలవుతుందని అంచనా
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను (వీఎల్టీ) రూపేణా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.417.08 కోట్లు వసూలయ్యాయి. ఇది గత ఏడాది ఇదే సమయానికి వసూలైన మొత్తంతో పోల్చితే రూ.97 కోట్లు అధికం కావడం విశేషం. మార్చి నెలాఖరు నాటికి మరో రూ.300 కోట్లు వసూలయ్యే అవకాశం ఉందని రెవెన్యూ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు.
జీవీఎంసీ పరిధిలో 6,02,937 ప్రైవేటు అసెస్మెంట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అసెస్మెంట్లు 1,656, కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన అసెస్మెంట్లు 529, ఖాళీ స్థలాల పన్ను (వీఎల్టీ)కు సంబంధించి 39,741 అసెస్మెంట్లు, కోర్టులో కేసులు పెండింగ్ ఉన్న అసెస్మెంట్లు 689 ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రైవేటు అసెస్మెంట్ల ద్వారా ఎరియర్స్ రూ.133.13 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నుల రూపేణా రూ.433.28 కోట్లు...మొత్తం రూ.566.41 కోట్లు వసూలు కావాల్సి ఉంది. రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, డిప్యూటీ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావులు ఎరియర్స్పై ప్రత్యేకంగా దృష్టిసారించి, ఆయా అసెస్మెంట్ల యజమానుల వద్దకు వెళ్లి చర్చించారు. కేసులను ఉపసంహరించుకునేలా చేసి, వారు పన్ను చెల్లించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడంతో బకాయిలు రూ.133.13 కోట్లలో రూ.43.91 కోట్లు వసూలయ్యాయి. దీంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకూ రూ.304.74 కోట్లు వసూలు చేయగలిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల నుంచి రూ.49 కోట్లు ఎరియర్స్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను రూ.20.64 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, ఎరియర్స్లో రూ.6.06 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.8.78 కోట్లు వసూలు చేశారు. ఇక కోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న 689 అసెస్మెంట్ల నుంచి ఎరియర్స్ రూ.245.96 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.27.72 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా...ఎరియర్స్లో రూ.7.28 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి రూ.5.15 కోట్లు వసూలు చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 529 అసెస్మెంట్ల నుంచి బకాయిలు రూ.367.18 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.50.2 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా...ఇప్పటివరకూ ఎరియర్స్ కింద రూ.98 లక్షలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1.36 కోట్లు వసూలు చేయగలిగారు. ఇక వీఎల్టీకి సంబంధించి 38,741 అసెస్మెంట్లు ఉండగా వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అసెస్మెంట్లే అధికం. ప్రభుత్వాలు వీఎల్టీ చెల్లించకపోవడంతో రూ.396.57 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఇవికాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.128.61 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రెవెన్యూ విభాగం అధికారులు ప్రత్యేకంగా దృష్టిపెట్టడంతో ఎరియర్స్ కింద రూ.18.63 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వీఎల్టీ రూ.20.23 కోట్లు వసూలు చేయగలిగారు.
గత ఏడాదితో పోల్చితే రూ.97 కోట్లు అధికంగా వసూలు
ఈ ఏడాది ఇప్పటివరకూ అన్నిరకాల అసెస్మెంట్ల నుంచి ఆస్తి పన్ను, వీఎల్టీ కలిపి రూ.417.38 కోట్లు వసూలైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి ఆస్తి పన్ను కింద రూ.281.17 కోట్లు, వీఎల్టీ కింద రూ.39.15 కోట్లు మొత్తం రూ.320.19 కోట్లు మాత్రమే వసూలైంది. అంటే గత ఏడాది కింటే రూ.97 కోట్లు అధికంగా వసూలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండున్నర నెలల సమయం ఉండడంతో మరో రూ.300 కోట్లు వరకూ వసూలయ్యే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.
మొత్తం అసెస్మెంట్లు
కేటగిరీ అసెస్మెంట్లు డిమాండ్ వసూలైన
(రూ.కోట్లలో) మొత్తం
ప్రైవేటు 6,02,937 566.41 348.65
రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 1656 69.63 14.84
కోర్టు కేసులు 689 273.68 12.42
కేంద్ర సంస్థలు 529 417.38 2.31
వీఎల్టీ 39741 525.18 38.86
మొత్తం 6,45,551 1852.28 417.08
---------------------------------