సీలేరు కాంప్లెక్సులో జోరుగా విద్యుదుత్పత్తి
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:09 AM
సీలేరు కాంప్లెక్స్లోని అన్ని కేంద్రాల్లో జలవిద్యుదుత్పత్తి పూర్తిస్థాయిలో జరుగుతున్నదని చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు తెలిపారు. సీలేరు పర్యటనలో భాగంగా ఆయన గురువారం ఇక్కడ ఏపీ జెన్కో అతిథిగృహంలో అధికారులతో సమావేశం అయ్యారు
రోజూ 9 మినియన్ యూనిట్లు...
గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని మించి ఉత్పత్తి
చీఫ్ ఇంజనీర్ రాజారావు
సీలేరు, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : సీలేరు కాంప్లెక్స్లోని అన్ని కేంద్రాల్లో జలవిద్యుదుత్పత్తి పూర్తిస్థాయిలో జరుగుతున్నదని చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు తెలిపారు. సీలేరు పర్యటనలో భాగంగా ఆయన గురువారం ఇక్కడ ఏపీ జెన్కో అతిథిగృహంలో అధికారులతో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ వినియోగం అధికంగా వుంటుందని, అందువల్ల గ్రిడ్ ఆదేశాల మేరకు సీలేరు కాంప్లెక్సులో గరిష్ఠస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి ఇంజనీర్లు కార్మికులు సిద్ధంగా వున్నారని చెప్పారు. సీలేరు కాంప్లెక్సు పరిధిలోని మాచ్ఖండ్, సీలేరు, పొల్లూరుల్లో గత వారం రోజుల నుంచినిత్యం తొమ్మిది మిలియన్ యూనిటల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నదని అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సీలేరు కాంప్లెక్సులో 2,314 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని సెంట్రల్ అథారిటీ నిర్దేశించగా, అంతకు మించి 2,465 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశామన్నారు. డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో 25 మెగావాట్ల సామర్థ్యంగల ఒక యూనిట్ మరమతులకు గురైందని, దీనిని 45 రోజుల్లో తిరిగి వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. ఒడిశా, ఆంధ్రా ఉమ్మడి నిర్వహణలో వ్ను బలిమెల జలాశయం నుంచి గడచిన వారం రోజులుగా నిత్యం ఎనిమిది వేల క్యూసెక్కుల చొప్పున సీలేరు జలాశయానికి తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. బుధవారం రాత్రి నుంచి దీనిని నాలుగు వేల క్యూసెక్కులకు తగ్గించామన్నారు. బలిమెలలో ఏపీ వాటా నీటిని కలుపుకొని సీలేరు, డొంకరాయి జలాశయాల్లో మొత్తం 57.2563 టీంఎంసీల నీరు అందుబాటులో వుందని ఆయన తెలిపారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు డొంకరాయి మొయిన్ డ్యామ్ ద్వారా గోదావరి డెల్టాకు 12 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. ఆయన వెంట సీలేరు ఎస్ఈ జాకీర్ హుస్సేన్, డీఈ బాలకృష్ణ వున్నారు.