తారు మిక్సింగ్ ప్లాంట్తో కాలుష్యం
ABN , Publish Date - Aug 02 , 2026 | 01:15 AM
మండలంలోని కొత్తకోటలో ఓ రోడ్డు కాంట్రాక్టర్ ఏర్పాటు చేసిన తారు మిక్సింగ్ ప్లాంటు నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ప్లాంటు ఏర్పాటు చేసినప్పుడే తాము వ్యతిరేకించామని, అయితే ఆరు నెలల్లో రోడ్డు పనులు పూర్తవుతాయని, వెంటనే ప్లాంట్ను ఇక్కడి నుంచి తరలిస్తామని కాంట్రాక్టర్ చెప్పారని, కానీ ఆరేళ్లయినా ఇక్కడి నుంచి తరలించలేదని స్థానికులు వాపోతున్నారు.
ఘాటైన వాసనతో దట్టంగా వెలువడుతున్న పొగ
తీవ్ర ఇబ్బందులు పడుతున్న కొత్తకోట గ్రామస్థులు
ఆరు నెలలు అని చెప్పి.. ఆరేళ్ల నుంచి కొనసాగిస్తున్న కాంట్రాక్టర్
రావికమతం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తకోటలో ఓ రోడ్డు కాంట్రాక్టర్ ఏర్పాటు చేసిన తారు మిక్సింగ్ ప్లాంటు నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ప్లాంటు ఏర్పాటు చేసినప్పుడే తాము వ్యతిరేకించామని, అయితే ఆరు నెలల్లో రోడ్డు పనులు పూర్తవుతాయని, వెంటనే ప్లాంట్ను ఇక్కడి నుంచి తరలిస్తామని కాంట్రాక్టర్ చెప్పారని, కానీ ఆరేళ్లయినా ఇక్కడి నుంచి తరలించలేదని స్థానికులు వాపోతున్నారు. గత రెండు, మూడు రోజులుగా తారు మిక్సింగ్ ప్లాంటు నుంచి పెద్ద ఎత్తున పొగ వస్తుండడంతో పార్టీలకు అతీతంగా టీడీపీ, వైసీపీ నాయకులు కోట గోవిందరావు, కోట సత్యనారాయణ, వెల్లంకి ఈశ్వరావు, గొర్లె కృషారావు, గుమ్ముడు సత్యదేవ, గ్రామపెద్దలు ప్లాంటు వద్దకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. బీఎన్ రోడ్డు నిర్మాణం కోసం ఆరేళ్ల క్రితం ఇక్కడ ప్లాంటు ఏర్పాటుచేశారని, ఆరు నెలల్లో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి, ప్లాంట్ను తీస్తేమని చెప్పిన కాంట్రాక్టరు.. ఆరు సంవత్సరాలైన ప్లాంట్ను తరలించలేదని, పైగా జిల్లాలో ఎక్కడ బీటీ రోడ్డు పనులు జరుగుతున్నా.. ఇక్కడి నుంచే హాట్ మిక్చర్ను తీసుకెళతున్నారని చెప్పారు. భరించలేని వాసనతోపాటు దట్టంగా వెలువడుతున్న పొగ కారణంగా ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తారును వేడిచేయడానికి వినియోగించే కట్టెలపై ఆయిల్ వ్యర్థాలను వేస్తుండడంతో ఘాటైన వాసన వస్తున్నదని ఆరోపిస్తున్నారు.