నివేదిక ఇవ్వండి
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:48 AM
స్టీల్ప్లాంటులో సోమవారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకున్న స్టీల్ మెల్ట్షాప్ (ఎస్ఎంఎస్)-1ను మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్కల్యాణ్ పరిశీలించారు.
ఉక్కు అధికారులకు ఉప ముఖ్యమంత్రి కె.పవన్కల్యాణ్ ఆదేశం
ఉక్కుటౌన్షిప్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ప్లాంటులో సోమవారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకున్న స్టీల్ మెల్ట్షాప్ (ఎస్ఎంఎస్)-1ను మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్కల్యాణ్ పరిశీలించారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎంఎస్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పవన్కల్యాణ్ వెంట మంత్రి నాదెండ్ల మనోహార్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్బాబు, విజయ్కుమార్, వంశీకృష్ణ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు ఉన్నారు.
ఎస్ఎంఎస్ విభాగం కార్మికుల ఆందోళన
గాజువాక, జూన్ 9 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ప్లాంటు ఎస్ఎంఎస్ విభాగంలో జరిగిన ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నిజానిజాలను వెల్లడించిన తరువాతే విధులకు హాజరవుతామని కార్మికులు మంగళవారం స్పష్టంచేశారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ విషయం ఉన్నతాధికారులకు తెలియజేసినప్పటికీ స్పందించలేదని ఆరోపించారు. అయితే ఈసారి చాలా పెద్దది జరిగిందని, భద్రతాపరంగా పూర్తిస్థాయిలో భరోసా ఇస్తేనే విధులకు హాజరవుతామని కార్మికులు ప్రకటించారు. మంగళవారం ఎవరూ విధులకు హాజరుకాలేదు. ఈ ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.