Share News

ఆశాజనకంగా పిప్పళ్ల ధరలు!

ABN , Publish Date - Jan 10 , 2026 | 10:57 PM

మన్యంలోని ఈ ఏడాది సైతం పిప్పళ్లు ధరలు ఆశాజనకంగా ఉండడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం మొదటి రకం కిలో రూ.350లకు వర్తకులు కొనుగోలు చేస్తున్నారు. గత మూడేళ్లుగా ధరలు స్థిరంగా ఉండడంతో రైతులకు నష్టాలు లేని పరిస్థితి కొనసాగుతున్నది.

ఆశాజనకంగా పిప్పళ్ల ధరలు!
ఔషధ గుణాలుండే పిప్పళ్లు

కిలో రూ.350 చొప్పున వర్తకులు కొనుగోలు

గత మూడేళ్లుగా స్థిరంగా కొనసాగుతున్న ధరలు

వారపు సంతల్లో ముమ్మరంగా క్రయవిక్రయాలు

ధరలు నిలకడగా ఉండడంతో గిరి రైతుల ఆనందం

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

ఏజెన్సీలోని వారపు సంతల్లో ప్రస్తుతం పిప్పళ్లు క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. శనివారం హుకుంపేటలో, సోమవారం పెదబయలులో, మంగళవారం జి.మాడుగుల, గురువారం పాడేరు మండలం గుత్తులపుట్టు వారపు సంతల్లో పిప్పళ్ల కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఔషధ గుణాలున్న పిప్పళ్లను ఏజెన్సీ వ్యాప్తంగా 15 వేల ఎకరాల్లో గిరిజనులు సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది డిసెంబరు ఆఖరి వారం నుంచి పిప్పళ్లు క్రయవిక్రయాలు మొదలై మార్చి నెలాఖరుకు వరకు కొనసాగుతాయి. ఏజెన్సీలో హుకుంపేట, జి.మాడుగుల, గుత్తులపుట్టు, పెదబయలు, ముంచంగిపుట్టు వారపు సంతల్లోనే ఎక్కువగా వీటి క్రయవిక్రయాలు జరుగుతాయి. వడ్డాది మాడుగులకు చెందిన వర్తకులు గిరిజన రైతులు, వర్తకుల నుంచి వాటిని కొనుగోలు చేస్తారు. పలు రకాల మందుల తయారీకి వినియోగిస్తుండడంతో వీటికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లతో మంచి డిమాండ్‌ ఉంది.

ఆశాజనకం పిప్పళ్ల ధరలు

ప్రస్తుతం పిప్పళ్లు ధరలు ఆశాజనకంగానే ఉన్నాయని గిరిజన రైతులు అంటున్నారు. 2021 వరకు పిప్పళ్లు కొనుగోలు ధరలు పతనం కాగా, 2022 నుంచి ధరలు కాస్తా బాగున్నాయని వారంటున్నారు. 2023 సంవత్సరం నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతుండడంతో మార్కెట్‌ బాగుందని వర్తకులు, రైతులు చెబుతున్నారు. ఔషధ గుణాలున్న పిప్పళ్లు రెండు రకాలుగా ఉంటాయి. ఎక్కువ లావుగా ఉన్నది మొదటి(ముడి)రకం, తీగలా ఉండేది రెండో (నలక) రకంగా విభజిస్తారు. ప్రస్తుతం మొదటి రకం కిలో రూ.350, రెండో రకం కిలో రూ.50 చొప్పున వారపు సంతల్లో వర్తకులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగానే ఉన్నాయని రైతులు, వర్తకులు ఆనందం వ్యక్తంచేశారు. అలాగే అంతర్జాతీయ, జాతీయ మార్కెట్‌లో ధరలకు అనుగుణంగానే స్థానిక సంతల్లోని వీటి ధరలను నిర్ణయిస్తారని వర్తకులు తెలిపారు. పిప్పళ్ల పంటకు ప్రభుత్వం నుంచి కనీస సహకారం అందడం లేదని గిరి రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏడేళ్ల క్రితం వరకు తమకు ఆంధ్రప్రదేశ్‌ ఔషధ మొక్కల బోర్డు నుంచి పంట సాగుకు రాయితీలు అందించే వారని, ఏడేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని వారంటున్నారు.

వి.మాడుగుల నుంచి జాతీయ మార్కెట్‌కు ఎగుమతి

అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్న వడ్డాది మాడుగుల నుంచి పిప్పళ్లు జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేస్తారు. గిరిజన రైతుల వద్ద కొనుగోలు చేసిన పిప్పళ్లను బాగా శుద్ధి చేసి, చిన్న చిన్న ముక్కలుగా కోసి, ఎటువంటి తేమ లేకుండా ఎండబెట్టి, ప్యాక్‌ చేసి కంటైనర్‌లలో ముంబయి, పశ్చిమబంగా, గుజరాత్‌, చెన్నై ప్రాంతాల్లోని జాతీయ మార్కెట్‌లకు ఎగుమతి చేస్తారు. అక్కడి నుంచి దేశంలో పలు ప్రాంతాలకు, ఇతర దేశాలకు అవి ఎగుమతి అవుతాయని వర్తకులు తెలిపారు.

Updated Date - Jan 10 , 2026 | 10:57 PM