మరింత పారదర్శకంగా పీజీఆర్ఎస్
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:01 AM
ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్)ను మరింత పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
అర్జీదారుల సౌకర్యార్థం క్యూఆర్ కోడ్
పీజీఆర్ఎస్ నిర్వహించే ప్రతి చోటా ఏర్పాటు చేయాలని సర్కారు ఆదేశం
పాడేరు, జూలై 20(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్)ను మరింత పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో అర్జీదారుల సౌకర్యార్థం ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను రూపొందించి, ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రధానం తమ సమస్యలపై ప్రజలు పీజీఆర్ఎస్లో అధికారులకు సమర్పించే అర్జీల పరిష్కారం, వాటి స్థితిగతులను తెలుసుకునేందుకు, అలాగే మీకోసం కార్యక్రమంలో సమర్పించిన అర్జీలపై తాజా స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 నంబర్ కాల్ సెంటర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే పీజీఆర్ఎస్పై ప్రభుత్వం నుంచి సైతం టోల్ ఫ్రీ కాల్స్ చేస్తూ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు.
క్యూఆర్ కోడ్తో పారదర్శకంగా సేవలు
పీజీఆర్ఎస్ సేవలను మరింత పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తాజాగా క్యూఆర్ కోడ్ను సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఆ క్యూఆర్ కోడ్ను పీజీఆర్ఎస్ నిర్వహించే జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలకు సైతం క్యూఆర్ కోడ్ సేవలను సద్వినియోగం చేసుకోవడంపై అవగాహన కల్పించాలని సూచించింది.