అర్జీలను వెంటనే పరిష్కరించాలి
ABN , Publish Date - May 20 , 2026 | 11:31 PM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ నిషాంతి ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ నిషాంతి ఆదేశం
డుంబ్రిగుడలో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం
88 అర్జీలు స్వీకరణ
డుంబ్రిగుడ, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ నిషాంతి ఆదేశించారు. డుంబ్రిగుడ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ నిషాంతి, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి లోకేశ్వరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 88 అర్జీలు వచ్చాయి. వీటిని సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీజీఆర్ఎస్ నోడల్ అధికారి కేఆర్ ఆర్సీ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ నీలకంఠరావు, జిల్లా పరిషత్ సీఈవో, ఐటీడీఏ ఏపీవో, జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకు ముందు టికిలిబెడ్డ గ్రామంలో ఉపాధి హామీ పథకం శ్రామికులతో కలెక్టర్ మాట్లాడారు. వారు చేసిన పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజా భాగస్వామ్యం అవసరం
ప్రజల భాగస్వామ్యమే ప్రభుత్వ బలమని, కలిసికట్టుగా గ్రామాలను ప్రగతి పథంలో నడిపించి ఆదర్శవంతమైన స్వయం సమృద్ధి గ్రామాలుగా మార్చుకుందామని కలెక్టర్ నిషాంతి పిలుపునిచ్చారు. కించుమండ పంచాయతీ కేంద్రంలో జన్ భాగీదారీ అభియాన్ ప్రత్యేక సేవా శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే అవసరం లేకుండా అన్నీ శాఖలు స్వయంగా గ్రామాల్లోకొచ్చి సేవలు అందించేలా ప్రభుత్వం మీ ఇంటి ముంగిటకే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమశాఖ డిప్యూటి డైరెక్టర్ పరిమళ, అధికారులు పాల్గొన్నారు.