తగ్గని పొగమంచు
ABN , Publish Date - Jan 23 , 2026 | 10:24 PM
మన్యంలో శుక్రవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగడంతో పొగమంచు, చలి తీవ్రత తగ్గలేదు.
కొనసాగుతున్న చలి
9 గంటల వరకూ అవస్థలే
జి.మాడుగులలో 6.3 డిగ్రీలు
పాడేరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): మన్యంలో శుక్రవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగడంతో పొగమంచు, చలి తీవ్రత తగ్గలేదు. దీంతో జనం చలికి గజగజ వణుకుతున్నారు. జిల్లా కేంద్రం పాడేరుతో సహా అన్ని ప్రాంతాఅల్లోనూ ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు వదలడం లేదు. దట్టమైన పొగమంచుకు వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తూ అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య ఘాట్ మార్గాల్లో అధికంగా ఉంది. అలాగే మధ్యాహ్నా వేళల్లో కూడా శీతలగాలులు వీస్తుండడంతో చలి ప్రభావం చూపుతున్నది. జనం చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని దుస్తులు ధరించడం, మంటలు కాగడం వంటివి చేస్తున్నారు.
జి.మాడుగులలో 6.3 డిగ్రీలు
మన్యంలో సింగిల్ డిజిట్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీంతో శుక్రవారం జి.మాడుగులో 6.3 డిగ్రీల సెల్సియస్గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా అరకులోయలో 6.7, హుకుంపేటలో 7.1, పెదబయలులో 7.5, చింతపల్లిలో 9.2, కొయ్యూరులో 12.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.