కొనసాగుతున్న ముసురు
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:19 AM
మన్యంలో ముసురు వాతావరణం కొనసాగుతున్నది. బుధవారం ఉదయం ఒక మోస్తరు ఎండకాయగా, మధ్యాహ్నం నుంచి ముసురు నెలకొంది.
హుకుంపేట, డుంబ్రిగుడలో భారీ వర్షం
పాడేరు, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): మన్యంలో ముసురు వాతావరణం కొనసాగుతున్నది. బుధవారం ఉదయం ఒక మోస్తరు ఎండకాయగా, మధ్యాహ్నం నుంచి ముసురు నెలకొంది. హుకుంపేట, డుంబ్రిగుడలో భారీ వర్షం కురిసింది. కొయ్యూరులో 32.8, అనంతగిరిలో 28.9, చింతపల్లిలో 28.0, అరకులోయలో 27.9, ముంచంగిపుట్టులో 25.1, పెదబయలులో 24.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హుకుంపేటలో..
హుకుంపేట: మండలంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏకధాటిగా వర్షం పడింది. దీంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహించాయి. మట్టి రోడ్లు చిత్తడిగా మారాయి.
డుంబ్రిగుడలో..
డుంబ్రిగుడ: మండలంలో బుధవారం మధ్యాహ్నం వర్షం కురవడంతో కించుమండ వారపు సంతకు వచ్చిన వినియోగదారులు, వర్తకులు తడిసి ముద్దయ్యాయి. రెండున్నర గంటలపాటు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షం వ్యవసాయ దుక్కులకు అనుకూలమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.